17 ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ పెంపు

17 ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ పెంపు

మోదీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. 17 ఖరీఫ్  పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)లను పెంచుతూ కేంద్ర క్యాబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి క్వింటాలు వరికి మద్దతు ధర రూ.1940. ఇప్పుడు దాన్ని మరో వంద రూపాయలు పెంచి, రూ.2040కి చేర్చారు. ఏ గ్రేడ్ వరికి మద్దతు రూ.2060 వరకు ఇస్తామని కేంద్రం వెల్లడించింది. ఇక పెరిగిన మద్దతు ధరలు పంటలవారీగా ఇలా ఉన్నాయి. జొన్న పంట మద్దతు ధర  రూ.2970కి చేరగా.. సజ్జలు రూ.2350, రాగి రూ.3578, మొక్క జొన్న రూ.1962, కందిపప్పు రూ.6600, పెసరపప్పు రూ.7755, మినప పప్పు రూ.6600, వేరుశనగ రూ.5850, ప్రొద్దుతిరుగుడు రూ.6400, సోయాబీన్ రూ.4300, నువ్వులు రూ.7830, పత్తి రూ.6080, పత్తి (పొడవు రకం) రూ.6380, నైగర్ సీడ్  మద్దతు ధర రూ.7287కి చేరాయి. ఖరీఫ్, రబీ సీజన్ లో ఎరువుల అవసరాలను తీర్చడానికి దేశంలో తగినన్ని యూరియా నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. డిసెంబరు దాకా యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు తగ్గాయని, రానున్న 6 నెలల్లో వాటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పారు. రైతులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే సరసమైన ధరలకు ఎరువులను అందుబాటులో ఉంచేలా సబ్సిడీని పెంచినట్లు వివరించారు. కాగా,  కందులపై క్వింటాలుకు మద్దతు ధర రూ.300, పెసర్లపై రూ.400, పొద్దుతిరుగుడుపై రూ.385,  సోయాబీన్ పై రూ.300, నువ్వులపై రూ.523 పెంచారు.