రూ.1,349 కోట్లతో లగ్జరీ విల్లా కొన్న ముకేశ్ అంబానీ!

రూ.1,349 కోట్లతో లగ్జరీ విల్లా కొన్న ముకేశ్ అంబానీ!

అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ వ్యాపారం చేసినా.. ఆస్తులు కొన్నా.. భారీ ఎత్తునే ఉంటుంది. తాజాగా ఆయన మరో కొత్త రికార్డు సృష్టించారు. దుబాయ్ లోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్ చేశారు. దాని విలువ దాదాపు రూ.1,349 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.  ప్రపంచ ఖ్యాతి గడించిన పామ్ జుమేరా ద్వీపంలో బీచ్ పక్కనే ఉన్న ఒక విలాసవంతమైన భవంతిని ముకేశ్ అంబానీ కొన్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కువైట్ దేశానికి చెందిన కుబేరుడు మహ్మద్ అల్ షయా నుంచి దీన్ని ముకేశ్ కొన్నారట. అయితే ఈ డీల్ పై రిలయన్స్ నుంచి కానీ.. అల్ షయా నుంచి కానీ అధికారిక ప్రకటన వెలువడలేదు.

8 బెడ్ రూమ్స్, 18 బాత్ రూమ్స్

ఈ నెల మొదటివారంలో ఇదే పామ్ జుమేరా ద్వీపంలోని మరో కళ్లు చెదిరే బిల్డింగ్ ను ముకేశ్ రూ.681 కోట్లకు  కొన్నారని వార్తలు వచ్చాయి. ఆ భవంతి పేరు ‘కాసా డెల్ సోల్’ అని.. అందులో 8 బెడ్ రూమ్స్, 18 బాత్ రూమ్స్, జిమ్, మూవీ థియేటర్, 15 కార్లు పార్క్ చేసేంత విశాలమైన బేస్మెంట్ ఉన్నాయనే టాక్ వినిపించింది.

ఒక ప్రత్యేకత

అయితే కొత్తగా పామ్ జుమేరా ద్వీపంలో రూ.1,349 కోట్లతో ముకేశ్ కొన్న భవంతికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే..  ఈ ఏడాది తొలినాళ్లలో తన కొడుకు అనంత్ అంబానీ కోసం రూ.643 కోట్లతో  కొన్న విల్లాకు ఇది కూతవేటు దూరంలోనే ఉంటుంది.

బ్రిటన్ లో..

బ్రిటన్ లోని ఐకానిక్ ప్లేస్ లలో ఒకటైన కంట్రీ క్లబ్ స్టోక్ పార్క్ ను గతేడాది రూ.652 కోట్లకు ముకేశ్ అంబానీ కైవసం చేసుకున్నారు. ఇది 300 ఎకరాల్లో అత్యంత విశాలంగా ఉంటుంది. అమెరికాలోని న్యూయార్క్ లోనూ ఒక విలాసవంతమైన భవంతిని కొనాలని ముకేశుడు యోచిస్తు్న్నట్లు వార్తలు వస్తున్నాయి.