నందికొండ మున్సిపాలిటీలోని 1,091 క్వార్టర్లు అమ్మాలని నిర్ణయం
ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ పరిధిలోని ఆస్తులన్నీ మున్సిపాలిటీకి ట్రాన్స్ ఫర్
ఆర్ డబ్ల్యు ఎస్ కు తాగునీటి సరఫరా బాధ్యతలు
మున్సిపాలిటీకి శానిటైజేషన్, స్టీట్ లైట్ల వెయింటెనెన్స్
క్వార్టర్స్ వేలాన్ని వ్యతిరేకిస్తున్న స్థానికులు
నల్గొండ, వెలుగు: నందికొండ మున్సిపాలిటీలో సరికొత్త వివాదానికి తెర లేచింది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పరిధిలోని క్వార్టర్స్ తమకే దక్కుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. ఎవరూ ఊహించని రీతిలో క్వార్టర్స్ ను వేలం వేయాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో అరవై ఏళ్లుగా అక్కడ ఉంటున్న కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్ ఎన్నికల నాటి హామీని విస్మరించి క్వార్టర్స్ ను బేరం పెట్టాలనుకోవడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.
వేలం వేయాలనే డిసైడ్
నందికొండ మున్సిపాలిటీగా మారాక తమ కష్టాలు తీరుతాయని ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలకు క్వార్టర్స్ బేరం పెడతారనే వార్త మింగుడు పడడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల హామీ మేరకు ఎవరైతే క్వార్టర్స్ లో ఉంటున్నారో వాళ్లకే ఇండ్లు అలాట్ చేయిస్తామని చెప్పారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. క్వార్టర్స్ ను అమ్మేసేందుకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు పరిధిలో ప్రస్తుతం 1,351 క్వార్టర్లు
ఉన్నాయి. ఇందులో 260 క్వార్టర్లు ఎన్ ఎస్పీ స్టాఫ్కు వదిలేసి, మిగిలిన 1,091 క్వార్టర్స్కు టెండర్లు పిలవాలని పేర్కొన్నారు. టెండర్లు పిలిచే అధికారాన్ని కలెక్టర్కు అప్పగించారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పటి నుంచి అక్కడే ఉంటున్న వందల కుటుంబాలు ఇప్పుడు రోడ్ల పైకి వచ్చే పరిస్థితి ఏర్పడింది.
గతంలోనే వ్యతిరేకించిన ప్రజలు
క్వార్టర్స్ ను విక్రయించే ప్రయత్నాలు గత ప్రభుత్వంలోనూ జరిగాయి. ఏ, బీ కేటగిరీలోని క్వార్టర్లు విక్రయించడానికి హిల్కాలనీలోని భూమికి గజం రూ.750, పైలాన్ కాలనీలోని భూమికి రూ.500 ఫిక్స్ చేశారు. కానీ స్థానిక ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సీ, డీ కేటగిరీలోని క్వార్టర్స్ను సాధారణ రేట్లకే ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గజం రూ. 3 వేల చొప్పున ఫిక్స్ చేశారు. ఏ కేటగిరీలోని క్వార్టర్స్ ధర రూ.1.70 లక్షలు, బీ టగిరీ క్వార్టర్స్ రూ.1.60 లక్షల చొప్పున నిర్ణయించారు. ఈ రేటుకు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పటి నుంచి క్వార్టర్స్ లో ఉంటున్నామని, తమకు నామినల్ రేట్లకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. పైగా సాగర్ డ్యాం నిర్మాణ
సమయంలో తాత్కాలికంగా నిర్మించిన క్వార్టర్లు, స్టోన్స్ క్వారీ దగ్గర నిర్మించిన కాలనీలు నామరూపాలు లేకుండా పోయాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు చెల్లించిన కిరాయిలే లక్షల్లో ఉంటాయని స్థానికులు చెప్తున్నారు.
టెండర్లు పిలిస్తే అంతే…
మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాదని ఇటీవల కొందరి కౌన్సిలర్లకు ఇండ్లు అలాట్ చేశారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం కొనసాగుతుండగానే క్వార్టర్స్ ను వేలం వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారపార్టీ నేతలు సైతం అవాక్కయ్యారు. టెండర్లు పిలిస్తే గొడవలు జరిగే ప్రమాదం ఉందని, దీనికి బదులు గజానికి ఇంత రేటు ఫిక్స్ చేస్తే బాగుండేదని అంటున్నారు. ఈ విషయాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని ఆ పార్టీ లీడర్లు చెప్తున్నారు.
మున్సిపాలిటీకి బదలాయింపు
ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ పరిధిలో ఉన్న తాగునీటి సరఫరా వ్యవస్థను ఆర్ డబ్ల్యూఎస్ కు అప్పగించారు. ఇతర మున్సిపాలిటీల్లో మాదిరే ఇక్కడ కూడా వాటర్ సప్లై చేస్తారు. హిల్ కాలనీ, పైలాన్ కాలనీలోని 7 ఎంఎల్ డీ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ఆర్ డబ్ల్యూఎస్ పర్యవేక్షణలోకి వెళ్తుంది. అన్ని కాలనీల్లో పారిశుద్ధ్యం, శానిటైజేషన్, వీధిలైట్ల మెయింటెనెన్స్ ను మున్సిపాలిటీ పరిధిలోకి మార్చారు. దీంతో పాటు ఆరు ఎకరాల నెహ్రూ పార్కు, ఐదు ఎకరాల ఎస్ బీ హెచ్ పార్కు ను ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ నుంచి తొలగించారు. సీసీ రోడ్లు 22.91 కిలోమీటర్లు, బీటీ రోడ్లు 25.7 కిలోమీటర్లు, ఇంటర్నల్ రోడ్లు 48.76 కిలోమీటర్లను మున్సిపాలిటీకి బదలాయించారు.