
- మున్సిపల్ ఎన్నికలకు ‘కొత్త చట్టం’తో అడ్డంకులు
- మే నెలాఖరు వరకు లోక్ సభ ఎన్నికల కోడ్
- అప్పటి వరకు చట్టా నికి ఆమోదం రానట్టే
- బడులు మొదలైతే దసరా వరకు ఆగాల్సిందే!
హైదరాబాద్ , వెలుగు: మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించడమే అందుకు కారణం. ఆ చట్టం ఆమోదానికి ఎన్నికల కోడ్ అడ్డుగా ఉండడంతో మరికొద్ది నెలలైనా ఎన్నికలకు టైం పట్టే అవకాశం ఉంది. గడువు పూర్తయిన మున్సిపాలిటీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనుంది. నిజానికి గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటే మున్సిపల్ ఎన్నికలనూ నిర్వహించాలని రా ష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. 58 పాత మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సమాయత్తమైంది. ప్రభుత్వం రిజర్వేషన్లనూ ఖరారు చేసింది.
కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో..
కొన్ని పంచాయతీలను కలిపి కొన్ని కొత్త మున్సిపాలిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో వాటి సంఖ్య 142కు పెరిగింది. మూడు పాత మున్సిపల్ కార్పొరేషన్లకు రెండేళ్లకు పైగా గడువుంది. మరో నాలుగైదు మున్సిపాలిటీల పాలక మండళ్లకు ఏడాది చివరి వరకు టైం ఉంది. దీంతో పాత, కొత్త మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే, 131 పంచాయతీలను 42 పాత మున్సిపాలిటీల్లో కలపడం, మరో 175 పంచాయతీలను విలీనం చేస్తూ కొత్తగా 75 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడంపై ఆయా పంచాయతీలు హైకోర్టుకెళ్లాయి. 126 పిటిషన్ లు వేశాయి. ఆ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు.. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో వాటి ఎన్నికలకు ఓకే అనుకున్నారంతా. కానీ, కొత్త మున్సిపల్ చట్టాన్ని ప్రభుత్వం తెరపైకితెచ్చింది. 2020 నాటికి రా ష్ట్రం లో మొత్తం జనాభాలోపట్టణ జనాభా 50 శాతానికి చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు తగినట్టు వసతులుకల్పించాలని భావించి కొత్త మున్సిపల్ చట్టానికి సర్కార్ రూపకల్పన చేసింది. అయితే, ఇప్పుడు లోక్సభ ఎన్నికల టైం. కోడ్ మే 27 వరకు అది అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దానికి ఆమోదం రాదు. జూన్ లో కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుంది. టీచర్లకు, స్కూళ్లకు మళ్లీ దసరాకే సెలవులు. ఎన్నికల్లో వారి విధులే కీలకం గనుక అప్పటిదాకా ఎన్నికలు జరగకపోవచ్చు.