
హైదరాబాద్,వెలుగు: ప్రముఖ ఉర్దూ పత్రిక మున్సిఫ్ అధినేత, ఎడిటర్ ఇన్ చీఫ్ ఖాన్ లతీఫ్ మహ్మద్ ఖాన్(80) శుక్రవారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమెరికాలోని చికాగోలో ట్రీట్మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. మున్సిఫ్ పత్రికను 1996లో కొనుగోలు చేసి ఎడిటర్ ఇన్ చీఫ్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో సికింద్రాబాద్ కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా, సుల్తాన్ ఉల్ ఉలుమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్గా ఖాన్ పనిచేశారు. ఖాన్ అంత్యక్రియలు చికాగోలోనే నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుర్లు ఉన్నారు. లతీఫ్ ఖాన్ ఆకస్మిక మరణం ఉర్దూ జర్నలిజానికి తీరని లోటు అని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఖాన్ మృతి పట్ల ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
For More News..