
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజల కోసం మళ్లీ రాజీనామాకైనా సిద్ధమేనని.. అవసరమైతే మునుగోడుకు మళ్లీ ఉప ఎన్నిక తెస్తానని హాట్ కామెంట్స్ చేశారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిత్వం నాది కాదని.. నాలాంటి వ్యక్తికి మంత్రి పదవి వస్తే ప్రజలకే మేలని అన్నారు. మంగళవారం (ఆగస్ట్ 5) సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మ గూడెం గ్రామంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విద్యుత్ సబ్ స్టేషన్ను ప్రారంభించారు.
నేను ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నానని అంటున్నారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం చెప్పినా కూడా మునుగోడు ప్రజల కోసం ఇక్కడ నుండే పోటీ చేశానని చెప్పారు. పదవిని అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించే వాడికి పదవి కావాలి కానీ.. నాలాంటి వారికి ప్రజలే ముఖ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడే తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని.. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల సమయంలోనూ అలాంటి హామీనే ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు గుర్తు చేశారు రాజగోపాల్ రెడ్డి. పదవి ఇస్తారా.. ఇవ్వరా అనేది మీ ఇష్టం.. సీనియర్ నేతనే కాబట్టి మంత్రి పదవి ఆశించడంలో తప్పులేదంటూ మనసులో ఉన్నది ోఓపెన్ గా చెప్పారు ఈ మునుగోడు ఎమ్మెల్యే.
మునుగోడు ప్రజల సంక్షేమం కోసం మళ్లీ రాజీనామాకైనా సిద్ధమేనంటూ ఆయన కామెంట్ చేయటం చర్చనీయాంశం అయ్యింది.
కేబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. పార్టీ సమీకరణల్లో ఆయనకు మంత్రి పదవి దక్కకపోవటంతో.. తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు మీరే అనుకుంటున్నారంటూ మీడియాతో వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలోనే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామాకైనా సిద్ధమేనని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.