జోరుగా నామినేషన్లు

జోరుగా నామినేషన్లు

నిజామాబాద్, కామారెడ్డి, వెలుగు :  నిజామాబాద్​పరిధిలోని ఆరు సెగ్మెంట్లలో  సోమవారం 12 మంది అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్లు వేశారు. బాల్కొండలో బీఆర్ఎస్​పక్షాన మంత్రి ప్రశాంత్​రెడ్డి, ముత్యాల సునీల్​రెడ్డి (కాంగ్రెస్​), మంగళారం భోజన్న (ధర్మసమాజ్​పార్టీ​) నామినేషన్ ​దాఖలు చేశారు. నిజామాబాద్ ​అర్బన్​నుంచి కాంగ్రెస్​అభ్యర్థిగా మహ్మద్​అలీ షబ్బీర్​తరఫున పార్టీ లీడర్లు నామినేషన్​ సమర్పించగా, మహ్మద్​ జహీరుద్దీన్​(ఇండిపెండెంట్) నామినేషన్​అందించారు.

బోధన్​లో బీజేపీ అభ్యర్థి వడ్డీ మోహన్​రెడ్డి, మహ్మద్​ సర్జీల్​పర్వేజ్​(ఆల్​ ఇండియా మజ్లిస్ –ఏ–ఇంక్విలాబ్) రెండో సెట్​నామినేషన్​ సమర్పించారు. ఆర్మూర్​ నియోజకవర్గంలో మైక గంగాధర్ (ఇండిపెండెంట్), బొంత సాయన్న (ఉత్తర రాష్ట్ర సమితి), బాన్సువాడలో కాంగ్రెస్​ కాసుల బాలరాజ్​తో పాటు ఆయన కొడుకు కాసుల రోహిత్, పుట్ట భాస్కర్​(ఇండిపెండెంట్) నామినేషన్​ అందజేశారు. కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి తరఫున ఆయన వర్గీయుల నామినేషన్​వేశారు. ఉడుతవార్ ​సురేశ్​(బీఎస్పీ)  బోలేశ్వర్​(ధర్మ సమాజ్​ పార్టీ), ఇండిపెండెంట్లుగా అబ్దుల్​వాహేద్, మహేందర్​రెడ్డి, వెంకట్​రావు, కలారాం అశోక్, భార్గవి, శివ, సాయన్న నామినేషన్​ వేశారు. జుక్కల్​లో బీజేపీ అభ్యర్థి అరుణతార, ఎల్లారెడ్డిలో ఇండిపెండెట్​అభ్యర్థి సంజీవులు నామినేషన్ వేశారు