
చావునోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని తెచ్చిండు
తెలంగాణ అనే పసిబిడ్డను మళ్లీ తండ్రి చేతిలో పెట్టడమే
కేసీఆర్కు ఇచ్చే బర్త్ డే గిఫ్ట్ అని వ్యాఖ్య
కేసీఆర్ కండ్లు తెరిస్తే రేవంత్ పని ఖతం: మధుసూదనాచారి
తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు
హైదరాబాద్, వెలుగు: తన తండ్రి కేసీఆర్ కారణజన్ముడని.. తనకు ఒక్కడికే కాదు తెలంగాణ జాతికి ఆయన హీరో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘తెలంగాణ జాతిపిత, బాపు కేసీఆర్.. తెలంగాణ జాతికి, 4 కోట్ల ప్రజలకు హీరో. ఆయన కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. సమైక్య దోపిడీ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించిండు. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని తెచ్చిండు” అని పేర్కొన్నారు.
సోమవారం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. 71 కిలోల కేకును కట్ చేశారు. అనంతరం కేటీఆర్, హరీశ్రావు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించే నాటికి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉండేవని కేటీఆర్ అన్నారు. ‘‘కోట్లాది మంది ప్రజల తరఫున కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని స్వప్నించారు.
25 ఏండ్ల పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించి.. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన కారణజన్ముడు ఆయన” అని అన్నారు. ఇప్పుడు అందరి లక్ష్యం కేసీఆర్ను మళ్లీ సీఎం చేయడమే కావాలని పిలుపునిచ్చారు. 60 లక్షల మంది గులాబీ సైనికులు కేసీఆర్ను సీఎం చేసేందుకు గట్టిగా పనిచేయాలని. అదే ఆ మహానుభావుడికి మనమిచ్చే బర్త్ డే గిఫ్ట్ అని చెప్పారు. ‘‘తెలంగాణ అనే పసిగుడ్డును తిరిగి తండ్రి చేతిలో పెట్టడమే కేసీఆర్కు ఇచ్చే గొప్ప బహుమతి” అని కేటీఆర్ పేర్కొన్నారు.