బీజేపీ నేత వరుణ్ గాంధీ భావజాలంతో తన ఐడియాలజీ కుదరదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా హోషియార్పూర్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. వరుణ్ గాంధీ భావజాలంతో ఏకీభవించలేనన్న రాహుల్.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యాలయానికి వెళ్లడం కన్నా తన తల నరుక్కోవడం ఇష్టపడతానని అన్నారు. తన కుటుంబానికి ఒక ఐడియాలజీ ఉందని, కానీ వరుణ్ గాంధీ మరో సిద్ధాంతాన్ని స్వీకరించారని రాహుల్ చెప్పారు. అయితే వరుణ్ ఐడియాలజీని తాను ఎప్పటికీ స్వీకరించలేనని స్పష్టం చేశారు.
వరుణ్ గాంధీని ప్రేమతో కలుసుకొని, కౌగిలించుకోగలనన్న రాహుల్ అన్నారు. అయితే ఆయన సిద్ధాంతానికి మాత్రం ఎప్పటికీ మద్దతు ఇవ్వలేనని స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్రలో వరుణ్ గాంధీ భాగస్వాములవుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో రాహుల్ ఈ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం వరుణ్ గాంధీ, ఆయన తల్లి మేనకగాంధీ బీజేపీలో ఉన్నారు.