ఏడేళ్ల తర్వాత తల్లి ఒడికి చేరిన చిన్నారి

 ఏడేళ్ల తర్వాత తల్లి ఒడికి చేరిన చిన్నారి

తప్పిపోయిన ఓ చిన్నారి ఏడేళ్ల తర్వత తల్లి ఒడికి చేరింది. వివరాల్లోకి వెళ్లితే.. డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా (తూర్పు గోదావరి జిల్లా) సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో 2016లో అక్ష అనే బాలిక తండ్రితోపాటు కనిపించకుండా పోయింది. తల్లి ద్వారక అప్పట్లోనే సఖినేటిపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పాప కోసం వెతుకుతోంది ఆ తల్లి. ఈ క్రమంలో ఎక్కడెక్కడో తిరిగి కరీంనగర్ చేరుకుంది చిన్నారి అక్ష. సైదాపూర్ మండలంలో భాగ్యలక్ష్మి అనే మహిళ దగ్గర పాపను అనుమానస్పదంగా గుర్తించి పోలీసులకు అప్పగించారు స్థానికులు. పోలీసులు ఆ చిన్నారిని కరీంనగర్ లోని బాల రక్షా భవన్ కు అప్పగించారు.

పాప ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చూసి తమ బిడ్డే అంటూ ఇటీవల వేరువేరు ప్రాంతాల నుంచి ఇద్దరు మహిళలు బాల రక్షా భవన్ కు వచ్చారు. వారిలో పద్మ అనే మహిళ తన మనవరాలేనంటూ, ద్వారక అనే మరో మహిళ పాప తన కూతురే అంటూ ఆధారాలు చూపించారు. దీంతో శిశు సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పద్మ చెప్పింది నిజమేనని నిరూపించుకున్న తర్వాత పాప తల్లి ద్వారకను పిలిపించారు అధికారులు. తనతో గొడవపడి భర్త రవి పాపను తీసుకొని వెళ్ళిపోయాడని ద్వారక అధికారులకు చెప్పింది. అయితే ఈ క్రమంలోనే పాప కోసం రవి కూడా రావడంతో అధికారులు పాప వారి బిడ్డేనని ధృవీకరించారు. విడిపోయిన భార్యాభర్తలు పాప సమక్షంలోనే ఏడేళ్ల తర్వాత కలిసిపోయారు. అన్ని ఆధారాలు ధ్రువీకరించుకున్న తర్వాత పాపను తల్లిదండ్రులకు అప్పగించారు అధికారులు.