అభిమానుల కోసం 'మెగా కార్నివాల్'

అభిమానుల కోసం 'మెగా కార్నివాల్'

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలుసు. ఆయన స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి, అనతి కాలంలో ఎన్నో కష్టానష్టాలను అనుభవించిన తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించారు మెగాస్టార్ చిరంజీవి. ఆగస్టు 22 వచ్చిందంటే కేవలం చిరంజీవి కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు.. మెగా అభిమానులకు పండగ రోజే. అభిమానులు ప్రతి ఏటా చిరంజీవి బర్త్ డేను అట్టహాసంగా జరుపుతారు. ఆ మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఇందులో భాగంగా ఇవాళ మెగా బ్రదర్ నాగబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కొన్ని విషయాలను పంచుకున్నారు. ప్రతి సంవత్సరం అన్నయ్య బర్త్ డే శిల్పకళ వేదికలో చేసేవాళ్ళం.. ఈ సంవత్సరం కొంచెం కొత్తగా ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు, బర్త్ డే వేడుకల్లో అభిమానులు కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఎంజాయ్ చేసే విధంగా డిజైన్ చేసినట్లు నాగబాబు చెప్పుకొచ్చారు. 

అలాగే అన్నయ్య అభిమానుల కోసం హైటెక్స్ లో కార్నివాల్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని నాగబాబు తెలిపారు. ఇండియాలో ఏ సినిమా హీరోకి కార్నివాల్ లాంటిది పెట్టలేదు.. ఈ కార్నివాల్  అనేది ఫ్యాన్స్ కి ఒక మెమొరబుల్ డే గా వుండాలని తెలిపారు. చాలా ఊర్లలో చిరంజీవి బర్త్ డేను పండుగ లాగా చేసుకుంటారు.. కార్నివాల్ లో అన్ని ప్రాంతాల అభిమానులు పాల్గొనాలని కోరారు. అన్ని సదుపాయాలు ఆ కార్నివాల్ లో ఉంటాయని అభిమానులకు నాగబాబు పిలుపునిచ్చారు. 

కార్నివాల్ లో చిరంజీవి గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు పంచుకుంటానని నాగబాబు తెలిపారు. ఈ కార్నివాల్ కి మా ఫ్యామిలీ నుంచి అందరూ హీరోలు పాల్గొంటారు. ఇతర హీరోలు, ఆయనను అభిమానించే వారు అందరూ ఈ ఫెస్టివల్ లో పాల్గొంటారని మెగా బ్రదర్ తెలిపారు.  ఇక సందర్భంగా మెగా కార్నివాల్ పోస్టర్ ను నాగబాబు ఆవిష్కరించారు.