
- 5 అడుగులు ఎత్తి1,47,755 క్యూసెక్కులు రిలీజ్
- ప్రాజెక్టులో 583 అడుగులకు నీటిమట్టం
- అప్రమత్తంగా ఉండాలని కృష్ణా నదీ పరివాహ ప్రాంతాల ప్రజలకు కలెక్టర్హెచ్చరిక
శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తుండడంతో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 583 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 10 గేట్లు 12 అడుగులు ఎత్తి దిగువకు 3,10,84 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు.
నల్గొండ, వెలుగు :ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వస్తుండడంతో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. దీంతో సాగర్ జలాశయం 20 క్రస్ట్ గేట్లను అధికారులు5 అడుగుల మేర ఎత్తారు. సోమవారం ఉదయమే అధికారులు ఆరు గేట్లు ఎత్తగా.. ఆ తర్వాత మరికొన్ని గేట్లను ఎత్తారు. తొలుత కృష్ణమ్మకు ఎస్ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్కుమార్ జలహారతి ఇచ్చి, నీటిని దిగువకు రిలీజ్ చేశారు.
దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం 3 సార్లు సైరన్ మోగించారు. అనంతరం ఒక్కొక్కటిగా ఇప్పటివరకు మొత్తంగా 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. కాగా, శ్రీశైలం జలాశయం నుంచి 10 గేట్లు 12 అడుగులు ఎత్తి దిగు వకు 3,10,84 క్యూసెక్కుల వరద నీటిని స్పిల్ వే మీదుగా విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 63,873 క్యూ సెక్కులు, మొత్తం 3,74,713 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ జలాశయంలోకి రిలీజ్ చేస్తున్నారు.
నాగార్జునసాగర్ప్రాజెక్టు నీటి మట్టం 583 అడుగులకు చేరగానే (పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు) పై అధికారుల ఆదేశాల మేరకు ప్రాజెక్టు చీఫ్ఇంజినీర్ నాగేశ్వరరావు 13వ గేటు స్విచ్ఛాన్చేసి నీటిని విడుదల చేశారు. ముందుగా 6 .. అనంతరం 10, సాయంత్రం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా 4 గేట్లు ఎత్తారు. ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి సాయంత్రం 5 గంటలలోపే 14 గేట్లను ఎత్తారు. అనంతరం మరో రెండు.. మొత్తం 16 గేట్లు. ఐదు అడుగులు ఎత్తి దిగువకు 1,18,848 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అనంతరం మరో 4 గేట్లు ఎత్తారు. విద్యుదుత్పాదన ద్వారా మరో 28.90 క్యూసెక్కు ల నీటిని రిలీజ్ చేస్తుండగా, మొత్తం 1,47,755 క్యూసెక్కుల వరద నీరు కృష్ణానదిలోకి విడుదలవుతున్నది.
సాగర్కు వరద ఉధృతి
పెరుగుతున్నది : సీఈ నాగేశ్వర్రావు
ఎగువన కర్నాటక, మహారాష్ట్ర లోని ప్రాజెక్టులు నిండడంతో నాగార్జునసాగర్ కు భారీ వరద వస్తున్నదని డ్యాం సీఈ నాగేశ్వర్రావు తెలిపారు. ఎగువన శ్రీశైలం డ్యామ్ వద్ద అన్ని గేట్లు ఎత్తి, 4 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారని చెప్పారు. దీంతో నాగార్జునసాగర్ డ్యాంలోకి వరద ఉధృతి పెరుగుతున్నదని తెలిపారు. డ్యాం సైట్లో ఇన్ఫ్లో 3,23,332 క్యూసెక్కులు నమోదవుతున్నదని చెప్పారు. ఎడమ, కుడి కాలువలతోపాటు ఎస్ఎల్బీసీ వరద కాలువతో కలిపి నాగార్జునసాగర్ప్రాజెక్టుకు1,63,220 క్యూసెక్కుల నీటినని విడుదల చేస్తున్నామని తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
ఈ ఏడాది పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని కలెక్టర్నారాయణరెడ్డి తెలిపారు. కాలువలకు సాగునీటిని కొంచెం కొంచెంగా విడుదల చేస్తున్నామని, ఎక్కడైనా కాలువలు బలహీనంగా ఉన్నచోట గుర్తించి వాటికి మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు. మరో 4 రోజుల్లో పూర్తిస్థాయిలో సాగునీటిని రిలీజ్ చేస్తామని చెప్పారు. అలాగే, చెరువులను నింపుతున్నామని వెల్లడించారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వచ్చే వరద ఆధారంగా సాగునీటిని పెంచడం, తగ్గించడం చేస్తామని చెప్పారు. క్రస్ట్ గేట్లు ఎత్తినందున కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా నదిలోకి స్నానానికి, ఈతకు వెళ్లొద్దని, మత్స్యకారులు చేపలు పట్టేందుకు నదిలోకి దిగొద్దని తెలిపారు. పశువులను కూడా నదిలోకి తీసుకెళ్లొద్దని సూచించారు.