నాగార్జునసాగర్లో గెలుపు కోసం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు
సొంత సీటు కాపాడుకోవాలని టీఆర్ఎస్ తాపత్రయం
పెండింగ్ పనుల పూర్తికి వేగంగా చర్యలు
సత్తా చాటేందుకు బీజేపీ కసరత్తు
తరచూ ప్రోగ్రాంలు.. ఢిల్లీ నేతలతో మీటింగ్లు
స్పెషల్ ఫోకస్ పెట్టిన ఏఐసీసీ
సెగ్మెంట్లో మకాం వేసిన జానా.. కేడర్తో వరుసగా సమావేశాలు
నాగార్జునసాగర్ ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలు చాలెంజ్గా తీసుకున్నాయి. గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. సెగ్మెంట్ లో బలం పెంచుకునేందుకు పావులు కదుపుతున్నాయి. సొంత సీటు కాపాడుకునేందుకు నియోజకవర్గంలో ప్రభుత్వపరంగా చేయాల్సిన పనులపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఒకవేళ తమ గెలుపు కష్టమైతే కాంగ్రెస్ విజయం కోసమైనా కృషి చేయాలి తప్ప.. బీజేపీకి చాన్స్ దక్కనివ్వొద్దనే వ్యూహంలో టీఆర్ఎస్ పెద్దలు ఉన్నట్టు ఆ పార్టీ లీడర్లు చర్చించుకుంటున్నారు. బీజేపీ మాత్రం మరోసారి బై ఎలక్షన్లో టీఆర్ఎస్ను ఓడించాలనే పట్టుదలతో ముందుకుపోతోంది. రాష్ట్రంలో పూర్తిగా డీలా పడిన కాంగ్రెస్ పార్టీ.. జానారెడ్డిని బరిలోకి దింపి కేడర్లో కొత్త జోష్ నింపాలని ప్రయత్నిస్తోంది.
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించడంతో ఖాళీ అయిన నాగార్జునసాగర్ అసెంబ్లీ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. మార్చి 16లోపు తిరుపతి లోక్సభ సీటుకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఆ ఎన్నికతో పాటే నాగార్జునసాగర్ బై ఎలక్షన్ జరిగే చాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాగార్జునసాగర్లో గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకుంటున్నాయి. ఆయా పార్టీల లోకల్ లీడర్లు సెగ్మెంట్లో ఎక్కువగా పర్యటిస్తున్నారు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై సాగర్ బై ఎలక్షన్ ఎఫెక్ట్ ఉంటుందని, ఎట్లయినా గెలిచి తీరాలని అన్ని పార్టీలు ప్లాన్ చేసుకుంటున్నాయి. సాగర్లో టీఆర్ఎస్ ఓడిపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కష్టాలు తప్పవని గులాబీ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ తమ అభ్యర్థి విజయం సాధిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపు నల్లేరుపై నడకేనని బీజేపీ నమ్ముతోంది. జానారెడ్డిని బరిలోకి దింపి విజయం సాధించాలని ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. ఆయన గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటొచ్చని భావిస్తోంది.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు, గతంలో ఇచ్చిన హామీల అమలుపై అధికార టీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే లోపే ఆ పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆఫీసర్లను ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. సెగ్మెంట్లో దాదాపు 38 వేల మంది యాదవ ఓటర్లు ఉంటే అందులో సగం మందికి గొర్లు అందలేదు. దీంతో ఆ ఓటర్లను ఆకట్టుకునేందుకు మూడేండ్లుగా పెండింగ్ లో ఉన్న గొర్ల పంపిణీ స్కీమ్ ను తెరమీదికి తెచ్చారని టాక్. సెగ్మెంట్లో పరిష్కారానికి నోచుకోని పనుల లిస్ట్ను తెప్పించుకొని, వాటికి కావాల్సిన నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తోంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న డిగ్రీ కాలేజీ, నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఇటీవలే నిధులు విడుదల చేసింది. నియోజకవర్గంలోని ఊళ్లకు వెళ్లే రోడ్ల పనులు, మంచినీటి సరఫరా, డబుల్ బెడ్రూం ఇండ్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించినట్టు సమాచారం. టీఆర్ఎస్ టికెట్ కోసం తేర చిన్నపరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, నోముల భగత్, మన్నేం రంజిత్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే బై ఎలక్షన్లో పోటీ చేసేందుకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రెడీగా ఉన్నట్టు కూడా ప్రచారం జరగుతోంది. దీంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై పార్టీ పలు సర్వేలు జరిపిస్తోంది.
దుబ్బాక, గ్రేటర్ తరహాలో బీజేపీ ముందుకు..
దుబ్బాక బై ఎలక్షన్లో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన జోష్లో ఉన్న బీజేపీ.. నాగార్జునసాగర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. దుబ్బాక, జీహెచ్ఎంసీలో అమలు చేసిన వ్యూహాన్నే సాగర్ బై ఎలక్షన్లోనూ అమలు చేసేందుకు రెడీ అయింది. గ్రౌండ్లెవల్లో బలం పెంచుకునే పనిలో పడింది. తరుచూ సెగ్మెంట్లో పార్టీ ప్రోగ్రాంలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. త్వరలో నియోజకవర్గంలో ఢిల్లీస్థాయి లీడర్లతో మీటింగ్ లు నిర్వహించే ఆలోచనలో ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరికలు పెరిగాయి. సాగర్ నుంచి కూడా ఇతర పార్టీల లీడర్లు క్యూ కడుతున్నారు. కొందరు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. అధికార పార్టీ ఫెయిల్యూర్స్ను జనంలో ఎండగట్టాలని, దుబ్బాక బై ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పును సాగర్ ప్రజలు కూడా ఇస్తారని లీడర్లు
నమ్ముతున్నారు.
సెగ్మెంట్లో జానారెడ్డి మకాం
నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై ఏఐసీసీ దృష్టి సారించింది. వరసగా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో పార్టీ ఢిల్లీ పెద్దలు అలర్ట్ అయ్యారు. ఇందుకోసం ఏకంగా కొత్త పీసీసీ చీఫ్ ఎంపికనే వాయిదా వేశారు. బై పోల్ ముందు కొత్త పీసీసీ చీఫ్ నియామకం జరిగితే పార్టీలో అంతర్గత పోరు జరిగే ప్రమాదం ఉందని గ్రహించారు. సాగర్ లో జానారెడ్డి పోటీ చేస్తారని అందరి కంటే ముందు కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించింది. కొన్ని రోజులుగా సెగ్మెంట్ లో జానారెడ్డి మకాం వేసి తన కేడర్ తో మీటింగ్ లు పెట్టుకుంటున్నారు.
ఇవీ చదవండి..