నాగరాజు కుటుంబానికి జాతీయ ఎస్సీ కమీషన్ చైర్మన్ పరామర్శ

నాగరాజు కుటుంబానికి జాతీయ ఎస్సీ కమీషన్ చైర్మన్ పరామర్శ

హైదరాబాద్: ఇటీవల నగరంలోని  సరూర్ నగర్ లో హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని జాతీయ ఎస్సీ కమీషన్ చైర్మన్ విజయ్ సాంప్లా పరామర్శించారు. ఈ సందర్భంగా విజయ్ సాంప్లా మీడియాతో మాట్లాడారు. నాగరాజు హత్యా ఘటన దురదృష్టకరమన్నారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి 3 ఎకరాల భూమి, ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రెండు విడతల్లో రూ.8.25 లక్షలు ఆర్ధిక సాయం అందనుందన్న ఆయన... మొదటి విడత కింద రూ.4.125 లక్షల చెక్కును అందజేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి రూ.5 వేల పెన్షన్ కూడా అందిస్తామని పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆయన వెంట బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ తదితరులు ఉన్నారు.