- ఏకపక్షంగా నిర్ణయాలు.. ప్లానింగ్లో లోపాలు
- ప్రజాభిప్రాయాలు, అభ్యంతరాలను పట్టించుకోవట్లే
నల్గొండ, వెలుగు: సీఎం కేసీఆర్ దత్తత పట్టణం నల్గొండ డెవలప్మెంట్విషయంలో లోకల్స్మాట నెగ్గట్లేదు. యాక్షన్ ప్లాన్స్ అన్నీ ఏకపక్షంగా జరిగిపోతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగానే నల్గొండ పట్టణాభివృద్ధి ప్రణాళికలు, నుడా ప్రపోజల్స్ ఫైనల్ చేస్తున్నారు. పట్టణాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే మున్సిపల్పాలకవర్గం, ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే సలహాలు, సూచనలకు ఏమాత్రం విలువివ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైకి ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ సమక్షంలోనే ప్లానింగ్ అంతా జరుగుతున్నట్టు కనిపిస్తున్నా తెరవెనక మాత్రం హైదరాబాద్ స్థాయి ఆఫీసర్లదే పైచేయిగా నిలుస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆరు నెలల వ్యవధిలో పట్టణ రూపురేఖలు మార్చాలన్న సీఎం సూచన మేరకు నెల రోజులుగా నల్గొండ టౌన్లో మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ సుడిగాలి పర్యటనలు చేశారు. వార్డులు, పార్కులు, పట్టణ పరిసర ప్రాంతాలన్నీ చుట్టొచ్చారు. కానీ చివరకు సీఎం సొంత మనిషిగా ముద్రపడ్డ మున్సిపల్ కమిషనర్ రమణాచారి చెప్పినదానికే ప్రభుత్వ పెద్దలు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. నల్గొండ పట్టణాన్ని విస్తరించేందుకు చేపట్టిన నుడా(నీలగిరి అర్బన్ డెవలప్మెంట్అథారిటీ) ప్లానింగ్లోనూ ఎమ్మెల్యే, జిల్లా ముఖ్యనేత ముందుండి నడిపించినట్లు కనిపించినా అంతిమంగా మాత్రం కేటీఆర్ డైరెక్షన్నే అంతా ఫాలో అవుతున్నారే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పట్టణ ప్లానింగ్లోని లోపాల గురించి స్థానికులు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నా.. మున్సిపల్ కౌన్సిల్లో వ్యతిరేకించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
అధికార పార్టీ కౌన్సిలర్లలో అసంతృప్తి
నల్గొండ మున్సిపల్ డెవలప్మెంట్గురించి ఇప్పటివరకు జరిగిన ప్లానింగ్ లో పాలకవర్గం ప్రేక్షకపాత్ర పోషించిందని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ కౌన్సిలర్లు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పట్టణంలో పేరుకుపోయిన సమస్యలను ప్లానింగ్లో చేర్చకుండా కేవలం రోడ్ల వెడల్పు, లైటింగ్, పార్కుల డెవలప్మెంట్కే ఫండ్స్ కేటాయించడా న్ని సభ్యులు తప్పుపడుతున్నారు. ముఖ్యంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న మార్కెట్లకు సంబంధించి ప్లానింగ్లో మార్పులు చేయాలని అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు చెప్తున్నప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదేమంటే సీఎం సార్ చెప్పినట్లు నడుచుకోవడమే తప్ప మరో మార్గం లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. బీట్మార్కెట్లో నాన్వెజ్ మార్కెట్ ఏర్పాటును ఆర్యవైశ్య సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సమీపంలో వాసవి మాత టెంపుల్ ఉండటం, ఆ ప్రాంతంలో ఆర్యవైశ్యులు ఎక్కువగా నివసిస్తుండటంతో నాన్వెజ్ మార్కెట్ వద్దని కోరుతున్నారు. అదే విధంగా ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీ వద్ద ఏర్పాటు చేయాలనుకున్న రైతుబజార్, బస్తీ దవాఖానలను స్టూడెంట్యూనియన్లు, కాలేజీ ఓల్డ్స్టూడెంట్స్, పొలిటికల్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అక్కడ గతంలో నిర్మించిన రైతుబజార్తో ఉపయోగం లేదని, దాన్ని తొలగించి ఆ ప్లేస్లో ఎస్సీ హాస్టల్ బిల్డింగ్ కట్టారు. మళ్లీ అదే ఏరియాలో రైతుబజార్ నిర్మిస్తే భవిష్యత్తులో కాలేజీ విస్తరణకు అడ్డంకిగా మారుతుందని చెప్తున్నారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్కు సంబంధించి ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ట్రీట్మెంట్ ప్లాంట్ కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా ఇప్పటివరకు ఫండ్స్ కేటాయించకపోవడం గమనార్హం.
మార్కెట్లకు ప్రత్యామ్నాయ స్థలాలు గుర్తించాలి
బీట్మార్కెట్లో నిర్మించాలనుకున్న నాన్వెజ్ మార్కెట్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద నిర్మించాలనుకున్న రైతుబజార్ కు ప్రత్యామ్నాయ స్థలాలు గుర్తించాలి. క్లాక్టవర్సెంటర్ వద్ద ప్రతిపాదించిన కళాభారతిలో ఎకరం స్థలం మార్కెట్లకు కేటాయించాలి. ఇదే విషయాన్ని కౌన్సిల్ మీటింగ్లోనూ చెప్పాం.
– బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్
నుడా ప్లానింగ్ పై ఆందోళన
నుడా ప్లాన్ నాలుగు సార్లు మార్చారు. ప్లాన్ నల్గొండ సెగ్మెంట్ దాటిపోకుండా ఉండేందుకు రూలింగ్పార్టీ లీడర్లు శతవిధాలా ప్రయత్నించారు. కానీ చివరకు నుడా నిర్మాణానికి భూములు సరిపోవని నకిరేకల్ నియోజకవర్గంలోని మూడు మండలాలు చేర్చారు. ఈ మండలాలను చేర్చడంలో ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పార్టీ పెద్దలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. చివరకు నుడాలో చేర్చిన గ్రామాల లిస్ట్లో కూడా గందరగోళం నెలకొంది. గెజిట్లో 41 విలేజ్లుగా పేర్కొనగా నల్గొండ టౌన్ పరిధిలోని విలేజ్లతో కలిపి 51 అని ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే ఈ విలేజ్ల పరిధిలో ఉన్న గ్రామాలను గెజిట్ లో పేర్కొనలేదు. దీంతో గెజిట్లో పబ్లిష్ చేసిన విలేజ్ల వరకే నుడా వర్తిస్తుందా.. లేదంటే వాటికి ఆనుకుని ఉన్న గ్రామాలకు కూడా వర్తిస్తుందా.. అనే క్లారిటీ కొరవడింది. నుడా కమిటీ మెంబర్స్ లిస్ట్లో ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు, లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డిని చేర్చడంపైనా రూలింగ్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో ముఖ్యమైన లీడర్లను కాదని కొత్తగా ఎన్నికైన నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన కోటిరెడ్డిని నుడాలో మెంబర్గా ఎలా నియమిస్తారని రూలింగ్ పార్టీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. డెవలప్మెంట్ప్లానింగ్లో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు, ఫ్లోర్ లీడర్లు బుధవారం నాటి వరంగల్ పర్యటనను సైతం బహిష్కరించారు.