గంగాధర, వెలుగు: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని ముంపు ప్రాంతంగా ప్రకటించాలని, గ్రామస్తులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఏఐఎఫ్బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి జోజిరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. 7 రోజులుగా గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని శనివారం వారు సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని విస్మరించారని విమర్శించారు. గ్రామస్తులు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అక్రమ కేసులు పెట్టడం సరైంది కాదన్నారు. గ్రామస్తుల ఐక్యతను దెబ్బ తీసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జి.రాజేశం, సత్యారావు, రాజశేఖర్, జోగు లక్ష్మీరాజం, మేచినేని నవీన్రావు, ఎండీ నజీర్, వడ్లూరి ఆదిమల్లు, గడ్డం స్వామి పాల్గొన్నారు.
