‘మార్స్’ ఇంట్ల ఏడాది ఉంటరా?

‘మార్స్’ ఇంట్ల ఏడాది ఉంటరా?
  • అంగారకుడి లాంటి వెదర్​తో ఇంటిని నిర్మించిన నాసా
  • 12 మందితో 3 రీసెర్చ్ మిషన్లు చేపట్టేందుకు ప్లాన్

వాషింగ్టన్: ఎటు చూసినా ఎర్రటి మట్టి, రాళ్లు, రప్పలు, ఇసుక.. దుమ్ము రేపే గాలులు, అకస్మాత్తుగా మారిపోయే టెంపరేచర్లు.. స్పేస్ సూట్ లేనిదే అడుగు బయటకు పెట్టలేం. మరోవైపు ఆక్సిజన్, ఫుడ్, నీళ్ల వంటి వాటికి కొరత రావచ్చు. మనుషులను కాంటాక్ట్ చేసేందుకు ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.. అంగారక గ్రహంపై భవిష్యత్తులో మనుషులు నివసిస్తే ఎదుర్కోవాల్సిన ప్రధాన సమస్యలివి. అందుకే మార్స్​పైకి మనుషులను పంపితే వచ్చే సమస్యలను ముందే తెలుసుకుని, పరిష్కారాలను కనుగొనే దిశగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఓ మిషన్​కు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఐకాన్ సంస్థతో కలిసి 3డీ ప్రింటింగ్ ద్వారా ‘మార్స్ డ్యూన్ ఆల్ఫా’ అనే ఇంటిని 1700 చదరపు అడుగుల నిర్మించింది. మార్స్​పై ఉండేలా ఎర్రటి మట్టితో కూడిన ఎడారిలాంటి ప్రాంతంలో ఈ ఇంటిని ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఒక్కో టీంలో నలుగురు చొప్పున మూడు టీంలను ఏడాది పాటు ఉంచి, వారిపై ‘క్రూ హెల్త్ అండ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ ప్లొరేషన్ అనలాగ్’ పేరుతో రీసెర్చ్ చేయనున్నట్లు నాసా ప్రకటించింది. ఫస్ట్ టీంను వచ్చే ఏడాది సెప్టెంబర్ 1న ఇందులోకి పంపనున్నట్లు వెల్లడించింది. 

అమెరికన్లకే చాన్స్..
‘మార్స్’ ఇంట్లో ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్న అమెరికన్ పౌరులు, యూఎస్ పర్మనెంట్ రెసిడెంట్లు మాత్రమే అప్లై చేసుకోవాలని నాసా కోరింది. అభ్యర్థుల ఏజ్ 30 నుంచి 55 మధ్యలో ఉండాలి. స్టెమ్​లో మాస్టర్ డిగ్రీ, పీహెచ్​డీ చేసి ఉండాలి లేదా పైలట్​గా పనిచేసి ఉండాలని, ఆస్ట్రోనాట్​లకు వర్తించే ఇతర నిబంధనలన్నీ వర్తిస్తాయని రూల్స్ పెట్టారు.