
హైదరాబాద్, వెలుగు: గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీ వేదికగా గురువారం ఆల్ఇండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నీలో పలు రాష్ట్రాలకు చెందిన యువ ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. ప్రారంభ కార్యక్రమంలో ఏపీ మాజీ సీఎస్ సుబ్రమణ్యం, జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ‘ప్రతీ ప్లేయర్ గెలుపు, ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలి.
గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడినప్పుడు కుంగిపోకుండా కెరీర్ కొనసాగించాలి. ఆటలో ఎత్తుపల్లాలు సహజం. గెలిచేందుకు కడదాకా ప్రయత్నించాలి’ అని అన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ చైర్మన్ శ్రీనివాసగుప్తా, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రావు, యూవీఎన్ బాబు, వంశీధర్ తదితరులు పాల్గొన్నారు.