రిషబ్ పంత్ కారు ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వ్యాఖ్యలకు నేషనల్ హైవే అథారిటీ ఇండియా కౌంటర్ ఇచ్చింది. పంత్ ప్రమాదం జరిగిన మార్గంలో ఎలాంటి గుంతలు లేవని జాతీయ రహదారుల శాఖ రూర్కీ డివిజన్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రదీస్ పింగ్ గుసైన్ తెలిపారు. అయితే ప్రమాద ఘటన జరిగిన చోట రాజ్ వాహ్ నది ఉండటంతో రోడ్డు ఇరుగ్గా ఉందని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత గుంతలకు మరమ్మతులు చేసినట్లు వచ్చిన వార్తలను ఖండించారు.
సీఎం ఏమన్నారంటే..
రోడ్డు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ను ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా రోడ్డుపై గుంత కారణంగానే పంత్ ప్రమాదానికి గురయ్యాడని పేర్కొన్నాడు. దీనికి తోడు పంత్ను పరామర్శించిన డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మా కూడా ప్రమాదానికి కారణం రోడ్డుపై గుంత అని చెప్పాడు. అయితే హరిద్వార్ రూరల్ ఎస్పీ ఎస్కె సింగ్ మాత్రం ప్రమాదం జరిగిన నార్సాన్ ప్రాంతానికి కిలోమీటరు ముందు పంత్ నిద్రమత్తులోకి వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని అన్నాడు.