
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 15 చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆదివారం ఏకకాలంలో దాడులు చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల ఇండ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టింది.
ఈ దాడుల్లో పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసున్నారు. పాకిస్తాన్ నుంచి గూఢాచర్యం రాకెట్ నడుపుతున్న వ్యక్తుల వివరాలు తెలుసుకునేందుకు ఈ సమాచారం తమకు ఉపయోగపడుతుందని వెల్లడించారు. గూఢాచర్యానికి సంబంధించి అవసరమైన ఆర్థిక వనరులు వీరి నుంచే అందినట్లు తాము అనుమానిస్తున్నామన్నారు.
ఇప్పటికే పాక్ అధికారులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, భయ్యా సన్నీ యాదవ్ సహా పలువురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. తాజాగా కాసీం అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నది.