బాలాఘాట్(ఎంపీ): కాంగ్రెస్ పార్టీ బ్రిటీషర్లనే తరిమికొట్టిందని, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులకు భయపడబోమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. చత్తీస్గఢ్లో ఇటీవల కేంద్ర ఏజెన్సీలు జరిపిన దాడులు తమ కార్యకర్తలను నిరుత్సాహపరచలేదని, అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన మధ్యప్రదేశ్లోని నక్సల్ ప్రభావిత బాలాఘాట్ జిల్లాలోని కటంగి పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. “నేను శుక్రవారం చత్తీస్గఢ్లో ఉన్నాను. మోదీ, షాలు ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడుల ద్వారా మా పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి.. వాళ్లను ఇళ్లలోనే కూర్చోబెట్టాలనుకున్నారు. మా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. దర్యాప్తు సంస్థలను ఆయుధంగా వాడుకుంటోంది” అని ఆరోపించారు. తాజాగా బెట్టింగ్యాప్ద్వారా చత్తీస్గఢ్కు నిధులు వచ్చాయని ఈడీ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఖర్గే ఇలా స్పందించారు.