- మాల్దీవుల నుంచి వచ్చిన ఐఎన్ఎస్ జలాశ్వ
కొచ్చి: ‘ఆపరేషన్ సముద్ర సేతు’లో భాగంగా మాల్దీవుల నుంచి బయలుదేరిన ఐఎన్ఎస్ బలాశ్వ యుద్ధనౌక ఆదివారం కేరళలోని కొచ్చికి చేరుకుంది. మాల్దీవుల్లో చిక్కకున్న 689 మందిని మన దేశానికి తీసుకొచ్చింది. లక్షద్వీప్లో ఇరుక్కున్న నలుగురిని కూడా ఈ నౌకలో తీసుకొచ్చారు. ఆపరేషన్లో భాగంగా మన దేశానికి చేరుకున్న తొలి నౌక ఇదే. కొచ్చికి చేరుకున్న వారిలో 400 మంది కేరళకు చెందిన వారు కాగా. మిగతా వారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారని అధికారులు చెప్పారు. తమిళనాడుకు చెందిన వారు187 మంది, తెలంగాణకు చెందిన 9 మంది, ఏపీకి చెందిన 8 మంది ఉన్నారు. మరో 8 మంది కర్నాటక రాష్ట్రానికి చెందిన వారు కాగా హర్యాణ, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్కు చెందిన వారు ముగ్గురు చొప్పున ఉన్నారు. వీరందరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు అన్నారు. లాక్డౌన్ కారణంగా మాల్దీవుల్లో చిక్కుకున్న ఇండియన్స్ను తీసుకొచ్చేందుకు ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ మాగర్ యుద్ధనౌకలు గురువారం మాల్దీవులకు చేరుకున్నాయి. అక్కడ చిక్కుకున్న మనవాళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇక్కడికి తరలించారు. మాగర్ యుద్ధ నౌక సాయంత్రానికి తమిళనాడుకు చేరుకోనుందని అధికారులు చెప్పారు.