- జిల్లా కలెకర్లకు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ధరణి కింద పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లను త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ధరణిలో కొత్తగా ఐదు మాడ్యూల్స్ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లతో హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులు, జీఓ58, 59, 76, 118 కింద భూ క్రమబద్దీకరణపై రివ్యూ చేశారు. మిట్టల్ మాట్లాడుతూ, జీఓ 58, 59, 76 కింద 1.89 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, వాటి ప్రాసెస్ మొదలుపెట్టి నెల రోజుల్లో పూర్తిచేయాలన్నారు.
కంపెనీలకు మంజూరు చేసిన పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులుంటే సవరించే అధికారాన్ని కలెక్టర్ లాగిన్లో అందించామన్నారు. ఆధార్ సీడింగ్ సమయంలో పొరపాటు వల్ల ఒకరి భూమి మరొకరికి అనుసంధానమైందని, దీని నివారణకు తహసీల్దార్ లాగిన్లో అవకాశమిచ్చామన్నారు. జీఓ 118 కింద పెండింగ్ ఉన్న దరఖాస్తులు 15 రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు.
