బౌలర్లు గెలిపించారు.. మూడో టీ20లో ఇండియా విక్టరీ

బౌలర్లు గెలిపించారు.. మూడో టీ20లో ఇండియా విక్టరీ
  •     7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా చిత్తు

ధర్మశాల: సౌతాఫ్రికాతో రెండో టీ20లో ఓటమి నుంచి ఇండియా వెంటనే పుంజుకుంది. వ్యక్తిగత కారణాలతో పేస్ లీడర్ జస్‌‌‌‌‌‌‌‌ప్రీత్ బుమ్రా దూరమైనా.. మిగతా  బౌలర్లు మ్యాజిక్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ఆదివారం హెచ్‌‌‌‌‌‌‌‌పీసీఏ స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 7 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో 2–1తో ఆధిక్యం అందుకుంది. తొలుత బౌలర్లు  ముప్పుతిప్పలు పెట్టడంతో  టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన సఫారీ టీమ్ 20 ఓవర్లలో 117 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. కెప్టెన్‌‌‌‌ ఐడెన్ మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్ (46 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.  పేసర్లు అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్ (2/13),  హర్షిత్ రాణా (2/34) కొత్త బాల్‌‌‌‌‌‌‌‌తో అద్భుతమైన స్వింగ్‌‌‌‌‌‌‌‌  రాబట్టారు. గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తేలిపోయిన అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్ తొలి ఓవర్లోనే రీజా హెండ్రిక్స్‌‌‌‌‌‌‌‌ (0)ను స్వింగ్‌‌‌‌‌‌‌‌తో బోల్తా కొట్టించి సఫారీల పతనం ఆరంభించాడు. ఆపై, హర్షిత్ రాణా  తన పేస్‌‌‌‌తో క్వింటన్ డికాక్ (1), డెవాల్డ్ బ్రెవిస్‌‌‌‌‌‌‌‌ (2)ను పెవిలియన్ పంపాడు. 

దీంతో సౌతాఫ్రికా 7 రన్స్‌‌‌‌‌‌‌‌కే 3 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఓవైపు వికెట్లు పడుతున్నా సౌతాఫ్రికా కెప్టెన్ మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్ పట్టుదలగా ఆడాడు. అయితే అతనికి మిగిలిన బ్యాటర్ల నుంచి సరైన సహకారం అందలేదు. స్టబ్స్ (9), కార్బిన్ బాష్ (4), మార్కోయాన్సెన్ (2) ఫెయిలయ్యారు. డోనోవన్ ఫెరీరా (20) కాసేపు మెరుపులు మెరిపించాడు.  స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (2/11), కుల్దీప్ యాదవ్ (2/12) లోయర్ ఆర్డర్ పని పట్టడంతో సఫారీ టీమ్ తక్కువ స్కోరుకే పరిమితం అయింది. అనంతరం  ఇండియా 15.5  ఓవర్లోనే  120/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఫెయిలైన ఓపెనర్లు అభిషేక్ శర్మ (18 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35), శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్ (28 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లతో 28) గాడిలో పడ్డారు. తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 60 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి విజయానికి బాటలు వేశారు. కెప్టెన్ సూర్య (12) తక్కువ స్కోరుకే ఔటైనా.. తిలక్ వర్మ (25 నాటౌట్‌‌‌‌‌‌‌‌), శివం దూబే (10 నాటౌట్‌‌‌‌‌‌‌‌) గెలుపు లాంఛనం పూర్తి చేశారు. అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌  ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. నాలుగో టీ20 బుధవారం లక్నోలో జరుగుతుంది. 

సంక్షిప్త స్కోర్లు

సౌతాఫ్రికా: 20 ఓవర్లలో 117 ఆలౌట్ (మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్ 61, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్ 2/13, చక్రవర్తి 2/11).
ఇండియా: 15.5 ఓవర్లలో 120/3 (అభిషేక్ 35, గిల్ 28, ఎంగిడి 1/23).

3  ఇంటర్నేషనల్ టీ20ల్లో 100 వికెట్లు 
తీసిన  మూడో ఇండియన్‌‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఈ లిస్ట్‌‌లో అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్, బుమ్రా  ముందున్నారు.