V6 News

డిసెంబర్ 11న రాష్ట్రానికి ఎన్డీఎస్ఏ చైర్మన్

డిసెంబర్ 11న  రాష్ట్రానికి ఎన్డీఎస్ఏ చైర్మన్
  •     రాష్ట్రంలోని డ్యాముల పరిస్థితిపై ఈఎన్​సీలతో మీటింగ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డ్యాముల పరిస్థితిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్​డీఎస్ఏ) దృష్టి సారించింది. అన్ని ప్రాజెక్టులపైనా కాంప్రహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ ఎవాల్యుయేషన్(సీడీఎస్ఈ) నిర్వహించాలని అక్టోబర్17న సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ లేఖ రాశారు. 2026 డిసెంబర్​ను డెడ్​లైన్​గా పెట్టారు. 

ఈ క్రమంలోనే డ్యాములకు సీడీఎస్ఈ నిర్వహించేలా అధికారులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై తెలుసుకునేందుకు ఎన్​డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ గురువారం హైదరాబాద్​కు వస్తున్నారు. ఈఎన్​సీలతో సమావేశం కానున్నారు. సింగూరు డ్యామ్ సహా రాష్ట్రంలోని మేజర్, మీడియం ప్రాజెక్టుల పరిస్థితిని తెలుసుకోనున్నారు. కాగా, డ్యాముల భద్రతకు సంబంధించి 2021లోనే కేంద్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్​ను తీసుకొచ్చింది. 

అన్ని డ్యాములకూ సీడీఎస్ఈ రికార్డులను 2026 నాటికి తయారు చేయాలని ఆ ఏడాదే చెప్పినా.. ఇప్పటివరకూ ఏ రాష్ట్రం నుంచీ స్పందన లేదు. ఈ క్రమంలోనే డ్యామ్ సేఫ్టీని కేంద్రం సీరియస్​గా తీసుకుంది. అందులో భాగంగానే తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకూ సీడీఎస్ఈ రికార్డులను తయారు చేయాలంటూ కేంద్రం లేఖలు రాసింది.  

రాష్ట్రాలు చేయాల్సింది ఇదీ.. 

1. డ్యామ్ రిస్క్ అసెస్మెంట్ స్టడీ: డ్యాముల ప్రస్తుత పరిస్థితితో పాటు గతంలో ఆ డ్యామ్​కు జరిగిన ప్రమాదం లేదా రాబోయే ప్రమాదాలకు సంబంధించి విశ్లేషించాలి. డ్యామ్ కరకట్టలు, గేట్లు, ఇతర నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయాలి.  

2. ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్: డ్యామ్​లకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలన్న దానిపై మాన్యువల్​ను ప్రిపేర్ చేయాలి. 

3. సీడీఎస్ఈ: ప్రతి డ్యామ్​కు డిజిటల్ లాగ్​బుక్​లు, డేటాబేస్​లను తయారు చేసి పెట్టుకోవాలి. డ్యామ్ పేరు, కవర్​పేజీతో పాటు ఆ డ్యామ్ లొకేషన్ వివరాలను పొందుపరచాలి. డ్యామ్​ ప్రయోజనాలు, దాని ఉద్దేశం వంటి వివరాలను డిజిటల్​గా రికార్డు చేయాలి. ఆపరేషన్ ప్రొటోకాల్, డ్యామ్ ఎత్తు, గేట్ల సంఖ్య, హెడ్ రెగ్యులేటరీలు, ప్రధాన కాల్వలు, విద్యుత్ ప్రాజెక్టుల వంటి వివరాలనూ రికార్డు చేయాలి.