వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్ను రివీల్ చేశారు. ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ అనే టైటిల్ను ఖరారు చేశారు. అంతేకాక బుధవారం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ మొదలైందని తెలియజేశారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ గెటప్లో కనిపించారు వెంకటేష్. టైటిల్ను బట్టి ఇందులో త్రివిక్రమ్ మార్క్ వినోదంతో పాటు ఉత్కంఠ రేకెత్తించే అంశాలు ఉండబోతున్నట్టు అర్థమవుతోంది.
వెంకటేష్ కెరీర్లో ఇది 77వ చిత్రం. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. గతంలో వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి చిత్రాల విజయంలో రచయితగా త్రివిక్రమ్ క్రెడిట్ ఎంతో ఉంది. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు.

