డైమండ్ లీగ్ ఛాంపియన్గా నీరజ్ చోప్రా

డైమండ్ లీగ్ ఛాంపియన్గా నీరజ్ చోప్రా

ఇండియన్ స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌ ఫైనల్లో విజయం సాధించాడు. జావెలిన్ ను  88.44 మీటర్లకు విసిరి  టైటిల్ను దక్కించుకున్నాడు. దీంతో డైమండ్‌ లీగ్‌ ఛాంపియన్గా నిలిచిన  భారత తొలి అథ్లెట్‌గా నీరజ్ రికార్డులకెక్కాడు. చెక్ రిపబ్లిక్‌ అథ్లెట్ జాకుబ్ వడ్లెజ్చ్ 86.94 మీటర్ల బెస్ట్ త్రోతో రెండవ స్థానంలో నిలిచాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 83.73 మీటర్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 

తొలి ప్రయత్నంలో విఫలం..
డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో ఆట ప్రారంభమైన తర్వాత తొలి ప్రయత్నంలో నీరజ్ చోప్రా ఫాల్ట్ చేశాడు. అయితే రెండో ప్రయత్నంలో మాత్రం 88.44 మీటర్లు జావెనిన్ ను విసిరి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. మూడో ప్రయత్నంలో 88 మీటర్లు, నాల్గో ప్రయత్నంలో 86.11 మీటర్లు విసిరాడు. చివరి ప్రయత్నంలో 87 మీటర్లు జావెలిన్ విసిరాడు. అయితే నీరజ్తో ఉన్న మిగతా అథ్లెట్లు..అతని వేగాన్ని..అందుకోవడంలో విఫలమయ్యారు. 

2017, 2018లోనూ డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్ కు నీరజ్ అర్హత్ సాధించాడు. అయితే టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు. నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించి సంచలనం సృష్టించాడు.