
పారిస్: ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. పారిస్ డైమండ్ లీగ్లో గోల్డ్ మెడల్ గెలిచాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ ఈటెను 88.16 మీటర్ల దూరం విసిరి టాప్ ప్లేస్లో నిలిచాడు. తొలి ప్రయత్నంలోనే ఇండియన్ అథ్లెట్ ఈ దూరాన్ని అందుకున్నాడు. 2023లో చివరిసారి ఇక్కడ టైటిల్ గెలిచిన నీరజ్ మళ్లీ రెండేళ్ల తర్వాత దాన్ని సాధించాడు. గత ఆరు డైమండ్స్ లీగ్ల్లో రెండో ప్లేస్తోనే సంతృప్తి పడ్డాడు. ఇక స్టార్లతో కూడిన పోటీలో రెండో ప్రయత్నంలో 85.10 మీటర్లకే పరిమితమైన నీరజ్ తర్వాతి మూడు ప్రయత్నాల్లో ఫౌల్ అయ్యాడు.
చివరిదైన ఆరో ప్రయత్నంలో 82.89 మీటర్ల దూరంతో సరిపెట్టుకున్నాడు. జర్మనీ స్టార్ జూలియన్ వెబర్ (87.88 మీటర్లు), లూయిజ్ మౌరిసియో డా సిల్వా (బ్రెజిల్, 86.62 మీటర్లు) వరుసగా సిల్వర్, బ్రాంజ్ నెగ్గారు. ‘నా త్రో తో నేను సంతోషంగానే ఉన్నా. నా రనప్ కూడా బాగుంది. కాకపోతే నా వేగాన్ని నియంత్రించుకోలేకపోతున్నా. ఈ ఫలితంతో సంతోషంగానే ఉన్నా. 24న ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్లో బరిలోకి దిగాల్సి ఉంది. కాబట్టి ఇంకాస్త మెరుగవ్వాలి. 90 మీటర్ల మార్క్పై ఇంకా ఆశలు ఉన్నాయి. దోహాలో ఒకసారి అధిగమించా. మరోసారి కూడా ప్రయత్నిస్తా’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు.