రేపు నీట్ ప్రవేశ పరీక్ష

రేపు నీట్ ప్రవేశ పరీక్ష

మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET) రేపు(ఆదివారం,సెప్టెంబర్‌ 12) జరగనుంది. దేశ వ్యాప్తంగా సుమారు 16లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. 202 పట్టణాల్లో 3,842 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు అధికారులు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పెన్నూ పేపరు విధానంలో నిర్వహించే ఈ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది. మధ్యాహ్నం 1.30గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. దీంతో ఏపీలోని 9నగరాల్లో 151 సెంటర్లను ఏర్పాటు చేయగా..  తెలంగాణలో 7 పట్టణాల్లో 112 సెంటర్లలో పరీక్షకు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రంలోకి అడ్మిట్‌ కార్డు, ఫొటో, గుర్తింపు కార్డు మాత్రమే అనుమతించనున్నట్టు నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పష్టం చేసింది. మాస్కు తప్పనిసరని, చిన్న శానిటైజర్‌ బాటిల్‌ను కూడా అనుమతిస్తామని తెలిపింది. పరీక్షను హిందీ, ఇంగ్లీష్ పాటు మొత్తం 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. కరోనా కారణంగా అభ్యర్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ కూడా చేయనున్నారు. 

పరీక్ష రాసే విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ ను NTA ప్రకటించింది. అబ్బాయిలు పొడుగు చేతుల చొక్కాలు, షూ ధరించరాదని తెలిపింది. అమ్మాయిలు చెవిపోగులు, గొలుసులు వంటి నగలు పెట్టుకోరాదని ఆదేశించింది.