- నిరుడు మంచిర్యాల గోదాం నుంచి భారీగా రైస్ పక్కదారి
- తిరిగి ఆ ఉద్యోగికే బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం
మంచిర్యాల, వెలుగు: జిల్లాలో రేషన్ బియ్యం గోదాముల నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. మండల్ లెవల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లను అర్హత, అనుభవం లేని ఉద్యోగుల చేతుల్లో పెట్టి చోద్యం చూస్తున్నారు. దీంతో ప్రతి నెలా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు మూమెంట్ లేట్ అవుతోంది. ఫలితంగా బియ్యం పంపిణీలో ఆలస్యం జరుగుతోంది.
అనుభవం లేక అవస్థలు....
మంచిర్యాల, చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, కోటపల్లి, తాండూర్లో ఎంఎల్ఎస్ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడినుంచే 423 రేషన్ షాపులకు బియ్యం సప్లై అవుతున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్లకు డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) స్థాయి అధికారులను ఇన్చార్జిలుగా నియమించాలి. వారు లేకుంటే సివిల్ సప్లై కార్పొరేషన్ పరిధిలోని డీఎం ఆఫీసు సిబ్బందిని కేటాయించాలి. కానీ జిల్లాలో స్టాఫ్ కొరత సాకుతో రెవెన్యూ డిపార్ట్మెంట్కు చెందిన సీనియర్ అసిస్టెంట్లకు ఎంఎల్ఎస్ పాయింట్లను అప్పగించారు. మంచిర్యాల మినహా మిగతా ఐదింటికి సీనియర్ అసిస్టెంట్లే బాధ్యులుగా ఉన్నారు. ఇందులో చెన్నూర్, కోట్లపలి ఒకరికి, బెల్లంపల్లి, తాండూర్ మరొకరికి అప్పగించారు. వీరికి గోదాముల నిర్వహణ, మూమెంట్పై అనుభవం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా రేషన్ మూమెంట్ లేట్ కావడంతో పంపిణీలో ఆలస్యమవుతోంది.
ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్ చేతిలో...
మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. ఇదివరకు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో ఎంఎల్ఎస్ పాయింట్ ఉండేది. ఈ గోదాములను నిరుడు మెడికల్ కాలేజీకి కేటాయించడంతో వేంపల్లిలోని ప్రైవేట్ గోదాంలోకి తరలించారు. అక్కడ స్థలం చాలడం లేదని నస్పూర్ మండలం తీగల్పహాడ్లోని ప్రైవేట్ గోడౌన్లలోకి మార్చారు. దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్కు చెందిన సీనియర్ ఉద్యోగిని ఇన్చార్జిగా నియమించారు. ఆయన అనారోగ్యంతో లీవ్ పెట్టి, ఆ తర్వాత బెల్లంపల్లి తహసీల్దార్కు వెళ్లిపోయాడు. దీంతో ఎంఎల్ఎస్ పాయింట్ను డీఎం ఆఫీసులో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్కు అప్పగించారు. శాఖలో సీనియర్ ఉద్యోగులు ఉన్నప్పటికీ నాలుగు నెలలుగా ఏమాత్రం అనుభవం లేని ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్తోనే నడిపిస్తున్నారు. గతంలో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగికే మళ్లీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.
అక్రమాలు జరిగితే బాధ్యులెవరు..?
ఎంఎల్ఎస్ పాయింట్లలో కనీస నిబంధనలను కూడా పాటించడం లేదు. చాలా చోట్ల సీసీ కెమెరాలు లేవు. తీగల్పహాడ్లోని గోదాముల్లో కరెంట్, తాగునీళ్లు కూడా లేవు. నిరుడు మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సుమారు 800 క్వింటాళ్ల బియ్యం మాయమయ్యాయి. హైదరాబాద్ నుంచి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వచ్చి లెక్కతేల్చేంత వరకు జిల్లా ఆఫీసర్లు పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో కొంతమంది అధికారుల పాత్రపై ఆరోపణలు వచ్చినప్పటికీ ఇన్చార్జిని బాధ్యుడిగా తేల్చి సస్పెండ్ చేశారు. మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో 140 రేషన్ షాపులు ఉన్నాయి. రేషన్ బియ్యంతో పాటు హాస్టళ్లకు సంబంధించిన సన్నబియ్యం, సీజ్డ్ రైస్ భారీ మొత్తంలో స్టాక్ ఉంటాయి. కోట్ల విలువైన వేల క్వింటాళ్ల బియ్యాన్ని ఒక ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్ చేతిలో పెట్టడంతో అక్రమాలు జరిగితే బాధ్యులెవరు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తూకం లేకుండానే సప్లై...
నిబంధనల ప్రకారం ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం తూకం వేసి సప్లై చేయాల్సి ఉండగా అవేమీ పట్టించుకోవడం లేదు. స్టేజ్1 గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చిన బియ్యాన్ని కాంటా వేసి గోదాముల్లో నిల్వ చేయాలి. మళ్లీ తూకం వేసి రేషన్ షాపులకు సప్లై చేయాలి. కానీ స్టేజ్1 గోదాముల నుంచి లారీల్లో వచ్చిన బియ్యం బస్తాలను ఎంఎల్ఎస్ పాయింట్వద్ద మరో లారీలోకి మార్చి నేరుగా రేషన్ షాపులకు రవాణా చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు పాత, చిరిగిన సంచుల్లో నుంచి బియ్యం కారిపోతున్నాయి. దీంతో 50 కిలోల బ్యాగులో 45 కిలోలకు కొంచెం అటూ ఇటుగా వస్తున్నాయని, ఒక్కో బస్తాకు నాలుగైదు కిలోలు తరుగుపోతున్నాయని డీలర్లు చెప్తున్నారు. అంతేగాకుండా ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద బియ్యం బస్తాలను కాంటా వేయకున్నా వేసినట్టు బోగస్ బిల్లులు పెట్టి హమాలీ చార్జీలను మింగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.