శ్రీశైలంలో.. మన కరెంట్కు కోత
కొంపముంచిన రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం
త్వరలో అమలులోకి రానున్న ఆంక్షలు
రికమండేషన్స్ను ఫైనల్ చేస్తూ కృష్ణా బోర్డుకు పంపిన ఆర్ఎంసీ కన్వీనర్
తెలంగాణ సంతకాలు పెట్టకపోయినా.. ముందే అంగీకరించిందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం.. కేఆర్ఎంబీ రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) అత్యుత్సాహం మనల్ని ముంచేశాయి. శ్రీశైలంలో తెలంగాణకు హక్కుగా ఉన్న కరెంట్ ఉత్పత్తిపై త్వరలో ఆంక్షలు అమలులోకి రానున్నాయి. బోర్డు మీటింగ్లో ఆర్ఎంసీ ఏర్పాటుకు అంగీకారం తెలుపడం మొదలు కమిటీ నివేదిక ఇచ్చే దాకా రాష్ట్ర సర్కారు అనుసరించిన వైఖరే దెబ్బకొట్టింది. కృష్ణా నీళ్లల్లో మన హక్కుల కోసం పాటుపడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమకు నీళ్లు మళ్లించుకునే ప్రతిపాదనను సమర్థించింది. ఫలితంగా.. కృష్ణా బోర్డు (కేఆర్ఎంబీ) రిలీజ్ ఆర్డర్ ఇస్తే తప్ప మనకు శ్రీశైలం నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే చాన్స్ లేదు. అది కూడా తాగు, సాగునీటి అవసరాలు ఉంటేనే కరెంట్ ఉత్పత్తి చేయాలన్న కొత్త నిబంధన రానుంది.
ఇంతకు ముందు ఇలాంటి ఆంక్షలు లేవు. పూర్తిసామర్థ్యం మేరకు కరెంట్ ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు తెలంగాణకు ఉండేది. తాజా ఆంక్షలపై కమిటీలోని ముగ్గురు సభ్యులతోపాటు కన్వీనర్ రవికుమార్ పిళ్లై సంతకం చేసి బోర్డుకు పంపారు. త్వరలో జరిగే బోర్డు మీటింగ్లో ఈ ఆంక్షలను తెలంగాణ వ్యతిరేకించినా బోర్డు ఆమోదించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం వల్ల మొత్తానికి మొత్తం శ్రీశైలం ప్రాజెక్టునే ఏపీకి ధారాదత్తం చేసేలా ఉన్న కమిటీ నివేదిక అమలులోకి రానుంది.
ఆర్ఎంసీ మీటింగ్లు ఇట్లా..!
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రొటోకాల్ (రూల్ కర్వ్స్), పవర్ జనరేషన్, ప్రాజెక్టులన్నీ నిండి నీళ్లు సముద్రంలోకి పోతున్న రోజుల్లో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటిని ఎలా లెక్కించాలనే తదితర అంశాల పై చర్చించి బోర్డుకు నివేదించేందుకు ఈ ఏడాది మే 10న కేఆర్ఎంబీ 16వ సమావేశం జరిగింది. ఇందులో ఆర్ఎంసీ ఏర్పాటుకు ఓకే చెప్పారు. ఆర్ఎంసీలో మెంబర్ కన్వీనర్గా బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లై, సభ్యులుగా బోర్డు పవర్ మెంబర్ మౌన్తంగ్, రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఈఎన్సీలు, జెన్కో చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు. మొత్తంగా ఆరుగురు సభ్యుల టీమ్ ఇది.
* మే 20న ఆర్ఎంసీ మొదటి మీటింగ్ నిర్వహించగా తెలంగాణ సభ్యులు హాజరుకాలేదు. అదే నెల 30న నిర్వహించిన రెండో మీటింగ్కు కూడా డుమ్మా కొట్టారు. ఈ రెండు మీటింగుల్లో కేఆర్ఎంబీతో పాటు ఏపీ సభ్యులు పాల్గొని శ్రీశైలం, నాగార్జునసాగర్లో కరెంట్ ఉత్పత్తి, రెండు రిజర్వాయర్ల ఆపరేషన్ ప్రొటోకాల్ (రూల్కర్వ్స్)పై చర్చించి పలు సూచనలు చేశారు.
* జులై ఒకటిన నిర్వహించిన మూడో మీటింగ్లో ప్రాజెక్టులన్నీ నిండిపోయే రోజుల్లో వినియోగించుకున్న నీటిని ఎలా లెక్కించాలనే దానిపై చర్చించారు. ఈ మీటింగ్కు తెలంగాణ సభ్యులు హాజరై.. సర్ ప్లస్ డేస్లో వినియోగించుకున్న నీటిని లెక్కించాలని, కానీ ఆ నీళ్లను రాష్ట్ర వినియోగం కోటాలో చేర్చరాదనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.
* ఆగస్టు 8న జరిగిన నాలుగో మీటింగ్లో అంతకుముందు ఆర్ఎంసీలో చర్చించిన అంశాలపై ఏకాభిప్రాయం తెచ్చేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఆర్ఎంసీ డ్రాఫ్ట్ రికమండేషన్స్ను రెండు రాష్ట్రాలకు కమిటీ పంపింది. అప్పుడు కానీ తెలంగాణ ప్రభుత్వం కండ్లు తెరుచుకోలేదు. మొదట నిర్వహించిన రెండు మీటింగ్లకు అటెండ్ కాకపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తెలంగాణ ప్రతిపాదనలను ఆర్ఎంసీ నివేదికలో చేర్చాలని పదే పదే లేఖలు రాసినా కన్వీనర్ పిళ్లై పరిగణనలోకి తీసుకోలేదు.
* అక్టోబర్ 17న నిర్వహించిన ఆర్ఎంసీ ఐదో సమావేశానికి రెండు రాష్ట్రాల సభ్యులు అటెండ్ కాలేదు.
* ఈనెల 3న ఆర్ఎంసీ ఆరో(చివరి) సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో మూడు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు కన్వీనర్ మీడియా సమావేశంలో తెలిపారు. రెండు రాష్ట్రాల ఈఎన్సీలు కూడా అన్ని అంశాల్లో ఏకాభిప్రాయం వచ్చిందని అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆర్ఎంసీ రికమండేషన్స్ను తమ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి సంతకాలు చేస్తామని రెండు రాష్ట్రాల సభ్యులు తెలిపారు. కేవలం సంతకాలు చేయడం కోసమే ఈ నెల 5న మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి సమావేశం జరిగింది. ఈ మీటింగ్కు తెలంగాణ సభ్యులు డుమ్మా కొట్టగా.. ఏపీ మెంబర్లు హాజరై సంతకాలు చేశారు. ఆర్ఎంసీ రికమండేషన్స్కు ఆమోదం తెలిపిన తెలంగాణ సభ్యులు సంతకాలు చేసేందుకు మాత్రం రాలేదని పేర్కొంటూ కన్వీనర్ పిళ్లై బోర్డుకు రిపోర్టు పంపారు. కేఆర్ఎంబీ మెంబర్ కన్వీనర్గా తాను, బోర్డు పవర్ మెంబర్ , ఏపీ సభ్యులిద్దరు సంతకాలు చేయడంతో నివేదిక ఫైనల్ అయిందని పేర్కొన్నారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ రవికుమార్ పిళ్లై కేఆర్ఎంబీ చైర్మన్కు నివేదించారు. ఆయన సీడబ్ల్యూసీకి బదిలీపై వెళ్తూ ఈ నివేదిక ఇచ్చారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది.
ముందే అంగీకరించిన ఫలితం..!
రిలీజ్ ఆర్డర్తో సంబంధం లేకుండా ప్రస్తుతం తెలంగాణ కరెంట్ ఉత్పత్తి చేస్తుంటేనే ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సుమారు 15 ఫిర్యాదులు చేసింది. సుప్రీంకోర్టులో కేసు కూడా వేసింది. అలాంటిది ఇప్పుడు రిలీజ్ ఆర్డర్ వంటి ఆంక్షలు అమలులోకి వస్తే శ్రీశైలం నుంచి తెలంగాణ కరెంట్ ఉత్పత్తి చేసుకోవడం అంత ఈజీ కాదని రిటైర్డ్ ఇంజనీర్లు అంటున్నారు. సంతకాల కోసం నిర్వహించిన ఆర్ఎంసీ మీటింగ్కు మాత్రమే తెలంగాణ రాష్ట్ర సర్కారు వెళ్లలేదని, అంతకు ముందు మీటింగ్లో తెలంగాణ సభ్యులు కమిటీ రికమండేషన్స్కు అంగీకరించారని, అలా అంగీకరించడమే కొంపముంచిందని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు అన్నీ తెలిసి మన హక్కులను ఏపీకి ధారాదత్తం చేశారని రిటైర్డ్ ఇంజనీర్లు మండిపడుతున్నారు. ఆర్ఎంసీ నివేదికపై తెలంగాణ సభ్యులు సంతకాలు చేస్తే తలెత్తే పరిణామాలపై ‘వెలుగు’ అలర్ట్ చేయడంతో.. ఆ నివేదికను తాము సమర్థించలేదంటూ మన అధికారులు ఒక లేఖ రాశారు. కానీ, నివేదికపై తెలంగాణ సభ్యులు సంతకాలు చేయకపోయినా.. ముందే అంగీకరించినందున రిపోర్టును ఫైనల్ చేస్తున్నట్లు కన్వీనర్ రవికుమార్ పిళ్లై బోర్డు చైర్మన్కు రిపోర్ట్ చేశారు.
ఆర్ఎంసీ రికమండేషన్స్ ఇవీ..!
* శ్రీశైలంలోని లెఫ్ట్ (తెలంగాణ), రైట్ (ఏపీ) ప వర్ స్టేషన్ల ద్వారా ఉత్పత్తి చేసే కరెంట్ను చెరి సగం పంచుకోవాలని ఆర్ఎంసీ నివేదికలో సూచించారు.
* శ్రీశైలం ప్రాజెక్టు దిగువన తాగు, సాగు నీటి అవసరాలు ఉంటేనే రెండు రాష్ట్రాలు కరెంట్ ఉత్పత్తి చేయాలి. ఒక టీఎంసీ ఇరిగేషన్ వినియోగం డిమాండ్ ఉంటే తెలంగాణ 0.53 టీఎంసీలు, ఏపీ 0.47 టీఎంసీల నీటిని వినియోగించి కరెంట్ ఉత్పత్తి చేయాలి.
* శ్రీశైలంలో 854 అడుగుల నీళ్లు (జూన్ నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు ) ఉంటేనే సాగునీటికి మళ్లించుకోవాలి. అదే లెవల్ ఉన్నప్పుడే కరెంట్ ఉత్పత్తికి నీటిని వినియోగించుకోవాలి. కరెంట్ ఉత్పత్తితో భవిష్యత్లో తాగునీటికి నీళ్లు లేకుండా పోయే పరిస్థితి కల్పించొద్దు.
* కరెంట్ ఉత్పత్తితో పాటు ఇరిగేషన్ అవసరాలను పర్యవేక్షించేందుకు పర్మినెంట్ రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (పీఆర్ఎంసీ)ని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ప్రతి పది రోజులకోసారి పవర్ జనరేషన్తో పాటు ఇరిగేషన్ నీటి విత్డ్రాల్స్ను పర్యవేక్షిస్తుంది.
* తెలంగాణలోని లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్కు మాత్రమే రివర్సబుల్ టర్బైన్లు ఉండటంతో కరెంట్ ఉత్పత్తి కోసం పీక్ అవర్స్లో వదిలిన నీటిని డిమాండ్ తక్కువ ఉన్న టైంలో తిరిగి రిజర్వాయర్లో పోయాలి. ఏపీకి ఈ సదుపాయం లేకపోవడంతో రివర్సబుల్ పంపింగ్ కోసం అయ్యే ఖర్చును ఆ రాష్ట్రం భరించాలి.
* శ్రీశైలంలోకి చేరే నీళ్లలో 75% నీటిని 2రాష్ట్రాలు తమ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలి. తెలంగాణ భూభాగంలోకి చేరిన ప్రతి చుక్కా కృష్ణా నీటిని లెక్కలోకి తీసుకోవాలి.
* జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల సహా ప్రకాశం బ్యారేజీల గేట్లు ఎత్తినప్పుడు రెండు రాష్ట్రాలు వినియోగించుకునే నీటిని లెక్కించినా, వాటిని ఆయా రాష్ట్ర కేటాయింపుల్లో చేర్చొద్దు. ఏ రాష్ట్రం ఎంత మేరకు సర్ప్లస్ నీటిని తీసుకున్నదనే అంశాన్ని పీఆర్ఎంసీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది.
* బ్రజేశ్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ -2) అమల్లోకి వచ్చి, నీటి పంపకాలకు రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపే వరకు మాత్రమే ఆర్ఎంసీ సిఫార్సులు అమల్లో ఉంటాయి.