
నెల్లూరు జిల్లా జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి, కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో అక్కడ ఉన్న పెన్నానదిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. అమ్మవారి దేవాలయం సమీపంలో నదిలో అమ్మవారి విగ్రహం బయటపడింది. దీంతో ఇంకేముంది అక్కడ భక్తులు బారులు తీరారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే....
నెల్లూరు జిల్లాలో కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే నదిలో అమ్మవారి విగ్రహం బయటపడటంతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి.. శక్తి స్వరూపినిగా ఉన్న అమ్మవారి రూపాన్ని చూసి పూజలు నిర్వహిస్తున్నారు. విగ్రహాన్ని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. భక్తుల కోలాహలం మధ్య అమ్మవారి రథోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్షేత్రం కిటకిటలాడింది. జొన్నవాడ గ్రామ వీధుల్లో రథం లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు.
ఇదిలా ఉండగా.. గత ఏడాది సెప్టెంబర్ నెలలో అల్లూరి జిల్లాలో బంగారు వర్ణపు విగ్రహం వాగు ఉధృతిలో కొట్టుకువచ్చింది. ఇసుక మేటలో భక్తులకు అభయం ఇస్తున్నట్లుగా నిలబడి ఉన్న స్వామి విగ్రహాన్ని చూసిన భక్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ప్రస్తుతం జొన్నవాడలో బయటపడిన అమ్మవారి విగ్రహం ఎక్కడి నుంచైనా కొట్టుకువచ్చిందా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.