మావిగన్ పేరుతో కొత్త రాజధాని ప్రకటించండి: జగన్ డిమాండ్

మావిగన్ పేరుతో కొత్త రాజధాని ప్రకటించండి: జగన్ డిమాండ్

తాడేపల్లి: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం-2014 సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజునే వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్లో రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను చంద్రబాబు రద్దు చేశారని.. న్యాయ రాజధానిగా కర్నూలును రద్దు చేశారని జగన్ చెప్పారు.

తాము చెప్పిన ప్లాన్-ఏ కూటమి ప్రభుత్వానికి నచ్చలేదని.. మరి తాము ప్రతిపాదన చేసిన ప్లాన్-బీ గురించి ఆలోచించారా అని ఏపీ ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ఉన్న 110 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉన్న ప్రాంతాన్ని ఏపీ రాజధానిగా ప్రకటించాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. తాము చెప్పిన ప్లాన్-బీ ఆలోచన ఇదేనని జగన్ తెలిపారు.

ALSO READ : అమరావతి రైతులకు ప్లాట్లు ఎప్పుడిస్తారో బిల్లులో పెట్టాలి

మచిలీపట్నం నుంచి ‘MA’, విజయవాడ నుంచి ‘VI’, గుంటూరు నుంచి ‘GUN’ కలిపి.. ‘మావిగన్’ అని పేరు పెట్టాలని జగన్ చెప్పుకొచ్చారు. ‘గన్’ అంటే జగన్ గుర్తుకొస్తాడనుకుంటే వేరే పేరు పెట్టుకోవాలని జగన్ సూచించారు. కనీసం.. ఈ ప్లాన్-బీ అమలు చేస్తే.. అమరావతిపై ఖర్చు చేస్తామని చంద్రబాబు చెబుతున్న రూ.2 లక్షల కోట్లలో 10 శాతం పెట్టినా రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుందని జగన్ సూచించారు. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ లాంటి రాజధాని కావాలని వైఎస్ జగన్ చెప్పారు.