- రాయదుర్గం చోరీ కేసులో నేపాలీ దంపతుల అరెస్ట్
- 110 తులాల గోల్డ్, రూ.7 లక్షలు స్వాధీనం
- పనోళ్లుగా చేరి వరుస చోరీలు చేస్తున్న జంట
- గ్రేటర్లో 5 కేసుల్లో నిందితులు
హైదరాబాద్,వెలుగు: రాయదుర్గంలోని ఓ ఇంట్లో పనోళ్లుగా చేరి భారీగా డబ్బు, బంగారం ఎత్తుకెళ్లిన నేపాలీ దంపతులను సైబరాబాద్ పోలీసులు మహారాష్ట్ర షోలాపూర్ హైవేలో అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 110 తులాల బంగారు నగలు, రూ.7లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. వాచ్మన్, సర్వెంట్లుగా ఇండ్లలో చేరి వరుస చోరీలు చేస్తున్న ఈ దంపతుల వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శనివారం వెల్లడించారు. గచ్చిబౌలి టెలికాంనగర్కి చెందిన భీరం గోవిందరావు(43) వ్యాపారం చేస్తున్నాడు. 5 నెలల క్రితం నేపాల్కి చెందిన లంక బహదూర్ సహి అలియాస్ లక్ష్మణ్(32), కడ్కె పవిత్ర అలియాస్ పన(26)ను వాచ్మన్, హౌస్ సర్వెంట్స్గా నియమించుకున్నాడు. గోవిందరావు కుటుంబసభ్యులకు తమపై నమ్మికం కలిగేలా లక్ష్మణ్, పవిత్ర వ్యవహరించారు. ఇంట్లో క్యాష్, గోల్డ్తో పాటు విలువైన వస్తువులు ఉండే ప్రాంతాలను గుర్తించారు. చోరీ చేసేందుకు టైమ్ కోసం ఎదురు చూశారు. ఈ నెల18న గోవింద్ రావు ఫ్యామిలీ శ్రీశైలం వెళ్లడాన్ని ఛాన్స్గా తీసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత రెండు గంటల ప్రాంతంలో ఇంట్లోని సీసీ కెమెరాల కేబుల్స్ను కట్ చేశారు. ఐరన్ రాడ్తో కిటికీలు పగులగొట్టి ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. మాస్టర్ బెడ్రూమ్ డోర్స్ను ఐరన్,రాడ్ కట్టర్స్తో పగులగొట్టారు. లాకర్స్లో దాచిన 110 తులాల గోల్డ్,డైమండ్ ఆర్నమెంట్స్తో పాటు రూ.8లక్షల క్యాష్ను దొంగిలించారు.
శ్రీశైలం నుంచి తిరిగివచ్చిన తరువాత బాధితుడు గోవింద్రావు రాయదుర్గం పోలీసులకు కంప్లయింట్ చేశాడు.4 స్పెషల్ టీమ్లను ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు.మహారాష్ట్ర,లక్నో, సిమ్లా, షోలాపూర్లో స్పెషల్ టీమ్స్తో సెర్చ్ చేశారు. నేపాల్ బోర్డర్ పోలీసులను అలర్ట్ చేశారు. బోర్డర్లో పట్టుకునే అవకాశాలు ఉంటాయనే అనుమానంతో నిందితులు షోలాపూర్లో షెల్టర్ తీసుకున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్, నిందితుల లైవ్ లొకేషన్ ఆధారంగా షోలాపూర్లో గుర్తించారు. నిందితులపై ఇప్పటికే రాయదుర్గం, మలక్పేట,ఫలక్నుమా, కుషాయిగూడ పోలీస్ స్టేషన్స్లో కేసులు ఉన్నట్లు చెప్పారు.