చెరో 10 మందిని తీసుకెళ్తున్న సీఎస్కే, కేకేఆర్
ఏర్పాట్ల పరిశీలనకు బీసీసీఐ టీమ్
న్యూఢిల్లీ: సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ పర్మిషన్ రావడంతో.. ఐపీఎల్ పై అటు బీసీసీఐ, ఇటు ఫ్రాంచైజీలు వేగం పెంచాయి. ఇప్పటికే సిద్ధం చేసుకున్న తమ ప్లాన్లను అమల్లో పెడుతున్నాయి. ఇందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ చెరో పది మంది నెట్ బౌలర్లను యూఏఈకి తీసుకెళ్లనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆరుగుర్ని సిద్ధం చేసుకుంది. మిగతా ఫ్రాంచైజీలు కూడా దాదాపుగా ఇదే బాటలో పయనిస్తుండటంతో.. మొత్తం 50 మంది బౌలర్లు అక్కడికి వెళ్లనున్నారు.
దీంతో ఇండియన్ జూనియర్ క్రికెటర్లకు ఇది వరంగా మారింది. లీగ్ ఇండియాలో జరిగితే లోకల్గా ఉండే జూనియర్, సీనియర్ బౌలర్లను ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. అయితే ఇప్పుడు బయో సెక్యూర్ బబుల్లోనే ఉండాలనే రూల్ తో ప్రత్యేకంగా నెట్ బౌలర్లను తీసుకెళ్తున్నారు. యూఏఈలో ఉండే బౌలర్ల కంటే ఇక్కడి నుంచి తీసుకెళ్తేనే సేఫ్ అని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ‘అన్ని అనుకున్నట్టు జరిగితే ప్రాక్టీస్ సెషన్స్ కోసం ప్రత్యేకంగా పది మంది బౌలర్లను యూఏఈ తీసుకెళ్తాం. టీమ్ తోపాటే వాళ్లు వస్తారు. టోర్నీ మొదలయ్యే వరకు అక్కడే ఉంటారు’ అని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు. తమ అకాడమీ కోచ్ అభిషేక్ నాయర్ నె ట్ బౌలర్లను ఎంపిక చేసే పనిలో ఉన్నారని నైట్రైడర్స్ వర్గాలు తెలిపాయి.
22న యూఏఈకి బీసీసీఐ టీమ్
యూఏఈలో లీగ్ ఏర్పాట్లను పరిశీలించేందుకు బీసీసీఐకి చెందిన స్పెషల్ టీమ్ ఈనెల 22న అక్కడి వెళ్లనుంది. దుబాయ్ కేంద్రంగా ఓ తాత్కాలిక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ముఖ్యమైన పనులను పర్యవేక్షించనుంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్, బీసీసీఐ సెక్రటరీ జై షా, ట్రెజరర్ అరుణ్ ధుమాల్, తాత్కాలిక సీఈవో హేమంగ్ అమిన్ ఈ టీమ్లో ఉన్నారు. అయితే బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ వెళ్తాడా? లేదా? అన్నది కన్ఫామ్ కాలేదు. లీగ్ టైటిల్ స్పాన్సర్ బిడ్ల ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ టీమ్ చార్టెడ్ ఫ్లైట్ లో యూఏఈ వెళ్తుంది.
బీసీసీఐ క్లి యరెన్స్ అందింది..
ఐపీఎల్ నిర్వహణకు సంబంధించిన అఫీషియల్క్లి యరెన్స్.. బీసీసీఐ నుంచి తమకు అందిందని ఎమిరేట్స్క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది. దీంతో సెప్టెంబర్ 19 నుంచి లీగ్ను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది. ‘ఐపీఎల్ ఆతిథ్యానికి సంబంధించి బీసీసీఐ నుంచి మాకు అధికారికంగా క్లియరెన్స్ లభించింది. లీగ్ ను నిర్వహించే అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నాం. మెగా ఈవెంట్కు అవసరమైన సహకారం అందిస్తాం. క్రికెట్ ఫ్యాన్స్ను అలరించే విధంగా టోర్నీని సక్సెస్ చేస్తాం’ అని ఈసీబీ చైర్మన్ షేక్ నహయాన్ పేర్కొన్నారు.