2024 సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మనవడు చంద్రబోస్ బీజేపీకి రాజీనామా చేశారు. దివంగత నేత ఆశయాలను పార్టీ నెరవేర్చనందుకు నిరసనగా పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు చంద్రబోస్ ప్రకటించారు.
2016లో బీజేపీలో చేరిన చంద్రబోస్ 2019 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేశారు. తాను బీజేపీలో చేరినప్పుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్, శరత్ చంద్ర బోస్ల సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు తనను అనుమతిస్తామని చెప్పారని, కానీ ఆ దిశగా ఏం జరగలేదని చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు.
2018లో బీజేపీలో చేరిన బోస్ పశ్చిమ బెంగాల్కు పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. అయితే, 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు టిక్కెట్ నిరాకరించారు.
Also Read :- ఇలా చేస్తే.. మీ కుటుంబం మొత్తానికి తిరుమలలో ఉచిత బ్రేక్ దర్శనం
2016లో బోస్ను పశ్చిమ బెంగాల్ ఉపాధ్యక్షుడిగా నియమించగా 2020లో పునర్వ్యవస్ధీకరణలో ఆయనకు చోటు దక్కలేదు. బీజేపీ వేదికగా దివంగత నేతల భావజాల వ్యాప్తికి దేశమంతా ప్రచారం చేయాలని భావించానని చెప్పుకొచ్చారు.
బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆజాద్ హింద్ మోర్చా స్ధాపించి కుల మతాలకు అతీతంగా నేతాజీ ఆలోచనల మేరకు అన్ని వర్గాలను భారతీయులుగా ఏకం చేయాలని అనుకున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపిన రాజీనామా లేఖలో తెలిపారు. తాను ప్రతిపాదించిన ఆలోచనలను కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం పట్టించుకోలేదని, బెంగాలీలకు చేరువయ్యేందుకు తన సూచనలను కూడా పార్టీ పెద్దలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.