ఐపీఎల్ ఆదాయం రూ.10 వేల కోట్లు.. మరి ప్రభుత్వానికి వచ్చింది ఎంత?

ఐపీఎల్ ఆదాయం రూ.10 వేల కోట్లు.. మరి ప్రభుత్వానికి వచ్చింది ఎంత?

క్యాష్ రిచ్ లీగ్‌గా ఐపీఎల్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతున్న విషయం అందరకీ విదితమే. అందుకే ఈ మెగా లీగ్‌ను అందరూ కాసుల లీగ్‌గా అభివర్ణిస్తుంటారు. 

ఈ టోర్నీలో ఆడటం వల్ల ఆటగాళ్ళు లాభపడితే.. సదరు ఆటగాళ్లపై పెట్టుబడి పెడుతుండటం వల్ల ఫ్రాంచైజీ ఓనర్లకు, మ్యాచులను టెలికాస్ట్ చేయడం ద్వారా బ్రాడ్‌కాస్టర్స్‌కు, టోర్నీ నిర్వహిస్తుండటం వల్ల బీసీసీఐకి కాసుల పంట పండుతోంది. అయితే ఈ టోర్నీ వల్ల ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా సమకూరకపోవటం గమనార్హం. ఈ టోర్నీకి కేంద్ర ప్రభుత్వం.. పన్ను నుంచి మినహాయింపు ఇస్తుండటం వల్ల నేరుగా ఒక్క రూపాయి అందదు. ఈ క్రమంలో కొందరు నెటిజన్స్.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ  కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

యాడ్ రెవెన్యూ రూ. 10వేల కోట్లు

ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023 సీజన్‌‌లో యాడ్ రెవెన్యూ రూ. 10,120 కోట్లు ఆర్జించినట్లు ఓ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇందులో 65 శాతం ఆదాయం బీసీసీఐ, ఫ్రాంచైజీ ఓనర్లు, బ్రాడ్‌కాస్టర్స్ నేరుగా అందుకోగా.. ఇతర మార్గాల్లో మరో 35 శాతం ఆదాయం సమకూరింది.

ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్, డిజిటల్ బ్రాడ్ కాస్టర్ జియో సినిమా రూ.4700 కోట్ల ఆదాయాన్ని అందుకోగా.. 10 ఫ్రాంచైజీలు నేరుగా యాడ్ రెవెన్యూ 1450 కోట్లు.. బీసీసీఐకి యాడ్ రెవెన్యూ ద్వారా 430 కోట్లు అందాయి. 

ALSOREAD:డబ్బులే డబ్బులు: బీసీసీఐ ఖజానాకు ఏడాదికి రూ.2 వేల కోట్లు!

ప్రభుత్వానికి 'సున్నా'

వేల కోట్లు రూపాయలు ఆదాయం సమకూరుతున్నా.. ప్రభుత్వ ఖజానాకు రూపాయి అందకపోవటం కొందరిని విస్మయానికి గురిచేస్తోంది.  ఈ క్రమంలో ఐపీఎల్ టోర్నీకి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరమేంటని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పటికే క్రికెట్‌కు కావలసిన ఆదరణ లభించిందని.. ఇప్పుడు పన్నులు కట్టాల్సిన సమయం వచ్చిందంటూ వారు ప్రభుత్వ పెద్దలకు సూచిస్తున్నారు.