న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్తగా 75 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) బుధవారం ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ తర్వాత సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ.. 2022లోగా కొత్త కాలేజీల నిర్మాణాలు పూర్తవుతాయని, ఇందుకోసం 24వేల 375 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని, తద్వారా మెడికల్ పీజీ, ఎంబీబీఎస్లో 15,700 సీట్లు అదనంగా పెరుగుతాయని వివరించారు. 300 అంతకంటే ఎక్కువ బెడ్లున్న జిల్లా ఆస్పత్రులకు అనుబంధంగా కొత్త కాలేజీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మెడికల్ ఎడ్యుకేషన్ విస్తరణకు సంబంధంచి ప్రపంచంలోని ఏ దేశం కూడా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోలేదని, గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ సర్వీసులు, చదువుకునే విద్యార్థుల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతోనే మోడీ సర్కార్ ఈ మేరకు చర్యలు చేపట్టిందని జవదేకర్ అన్నారు.
చెరుకు రైతులకు భారీ సబ్సిడీ
2019-–20 సంవత్సరానికి గాను 60 లక్షల టన్నుల చెరుకు ఎగుమతి కోసం ఎక్స్పోర్ట్ సబ్సిడీ అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం 6వేల 268 కోట్లు వెచ్చిస్తున్నామని, ఈ సబ్సిడీ మొత్తం నేరుగా వివిధ రాష్ట్రాల్లోని చెరుకు రైతుల ఖాతాల్లోకి వెళుతుందని జవదేకర్ చెప్పారు.
ఎన్డీఆర్ఎఫ్ తరహాలో సీడీఆర్ఐ
ప్రకృతి విపత్తుల్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అంతర్జాతీయంగా కొత్త సంస్థను ఏర్పాటు చేసేందుకు ఇండియా ప్రయత్నాలు ఆరంభించింది. ఆ మేరకు ఇంటర్నేషనల్ కోయెలీషన్ ఫర్ డిజాస్టర్ రీసిలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(సీడీఆర్ఐ)ని ప్రధాని మోడీ యూఎన్ఓలో ప్రకటిస్తారు. స్కిల్ డెవలప్మెంట్ రంగాలకు సంబంధించిన ‘వరల్డ్ స్కిల్ ఒలింపియాడ్’ను ఇండియాలో నిర్వహించాలని కేంద్రం డిసైడైంది.