- ఈ నెలాఖరు కల్లా 25 బస్సులు అందుబాటులోకి
హైదరాబాద్, వెలుగు: ఈనెలాఖరు కల్లా 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు సిటీ రోడ్లపైకి వస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఇప్పటికే విజయవాడ రూట్లో సేవలు అందిస్తున్నామని వివరించారు. ఈనెలాఖరుకల్లా ఎయిర్పోర్ట్ రూట్లో, ఐటీ కారిడార్ ఏరియాల్లో ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. సోమ వారం బస్భవన్లో బస్సులను పరిశీలించిన ఆయన.. ఒలెక్ట్రా కంపెనీ ప్రతినిధులకు పలు మార్పులు సూచించారు.
వీలైనంత త్వరగా బస్సులు అందజేయాలని కోరారు. ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ (ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్డర్ ఇచ్చామన్నారు. అందులో 500 బస్సులు హైదరాబాద్ సిటీలో, 50 బస్సులు విజయవాడ రూట్లో నడపాలని నిర్ణయించామని తెలిపారు. ఇప్పటికే విజయవాడ మార్గంలో 10 బస్సులు నడుస్తున్నాయన్నారు. హైదరాబాద్లో తొలి దశలో 50 బస్సులు రాబోతున్నాయని, వాటిలో 20 ఎయిర్పోర్ట్ రూట్లో, 30 ఐటీ కారిడార్లో నడుపుతామని తెలిపారు.
వాటిలో 25 బస్సులను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది మార్చ్ నాటికి సిటీలో 500 బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. వీటిలో 50 ఏసీ బస్సులుండగా, మిగిలినవి ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లు అని తెలిపారు. ఈ బస్సులు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 225 కిలో మీటర్ల దూరం వరకు ప్రయాణించొచ్చని వివరించారు.