- న్యూ మోడల్స్ లాంచ్ చేస్తామని ప్రకటించిన టాప్ కంపెనీలు
- ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈవీ సెక్టార్లోకి భారీగా పెట్టుబడులు
- లగ్జరీ కార్ల తయారీ కంపెనీలదీ అదే మాట
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) సెక్టార్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో బండ్ల తయారీ కంపెనీలు కొత్త మోడల్స్ను తేవాలని ప్లాన్ చేస్తున్నాయి. టాటా మోటార్స్, హ్యుండాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకీ వంటి కంపెనీలు రానున్న కొన్నేళ్లల్లో కనీసం ఐదుకి పైగా ఈవీ మోడల్స్ను తీసుకొస్తామని ప్రకటించాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి పెద్ద మొత్తంలో ఈవీ మోడల్స్ను లాంచ్ చేస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా సీఈఓ (ఆటోమోటివ్) నలినికాంత్ గొల్లగుంట పేర్కొన్నారు.
తమ ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్ ఇంగ్లోను బేస్ చేసుకోని ఐదు కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీలను తెస్తామని అన్నారు. 2027 నాటికి తమ కార్ల పోర్టుఫోలియోలో 30 శాతం ఎలక్ట్రిక్ వెహికల్సే ఉంటాయన్నారు. ఈవీ సెక్టార్పై ఫోకస్ పెట్టామని, భారీగా ఇన్వెస్ట్ చేస్తామని మారుతి సుజుకీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి పేర్కొన్నారు. ఫుల్ ఛార్జ్పై 550 కి.మీ వరకు ప్రయాణించే హై ఎండ్ ఎలక్ట్రిక్ కార్లను త్వరలో తయారు చేస్తామని అన్నారు.
రానున్న ఏడు నుంచి ఎనిమిదేళ్లలో ఆరు ఈవీ మోడల్స్ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఆయిల్ దిగుమతులను తగ్గించుకోవాలంటే కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్పైనే ఆధారపడకూడదని, హైబ్రిడ్–ఎలక్ట్రిక్, సీఎన్జీ, బయో సీఎన్జీ, ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి ఆల్టర్నేటివ్ టెక్నాలజీలు అవసరమని వివరించారు. అన్ని టెక్నాలజీలతో పనిచేసే బండ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈవీ పాలసీతో పెరగనున్న తయారీ
హ్యుండాయ్ 2019 లోనే ఎలక్ట్రిక్ ఎస్యూవీ కోనాను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. కిందటేడాది హై ఎండ్ ఈవీ ఐయానిక్యూ5 మోడల్ను తెచ్చింది. 2030 నాటికి దేశ ఆటో ఇండస్ట్రీలో ఈవీల వాటా 20 శాతానికి చేరుకుంటుందని హ్యుండాయ్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ సెక్టార్ను పోత్సహిస్తుండడంతో పాటు కొత్త పాలసీలను తెస్తుండడంతో త్వరలోనే ఈవీ సెక్టార్ విస్తరిస్తుందని అంచనా వేశారు.
ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో లీడర్గా ఉన్న టాటా మోటార్స్ ఈ సెక్టార్లో విస్తరించేందుకు భారీగా ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. 2026 నాటికి 10 ఈవీ మోడల్స్ను మార్కెట్లోకి తెస్తామని కంపెనీ స్పోక్స్పర్సన్ పేర్కొన్నారు. కర్వ్ ఈవీ, హారియర్ ఈవీతో కలిపి నాలుగు ఎలక్ట్రిక్ కార్ల మోడల్స్ను ఈ ఏడాదే లాంచ్ చేస్తామని ప్రకటించింది. ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు కూడా ఈవీ సెక్టార్పై ఫోకస్ పెట్టాయి.
ఇండియన్ మార్కెట్పై సీరియస్గా ఉన్నామని, ఈ ఏడాది 12 కొత్త మోడల్స్ను లాంచ్ చేస్తామని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా స్పోక్స్పర్సన్ పేర్కొన్నారు. ఇందులో మూడు ఎలక్ట్రిక్ మోడల్స్ ఉంటాయన్నారు. డిమాండ్ బట్టి మరిన్ని తీసుకొస్తామని చెప్పారు. 2030 నాటికి ఇండియాలో సేల్ అయ్యే తమ కార్లలో సగం ఎలక్ట్రిక్ వెహికల్సే ఉంటాయని ఆడి ఇండియా ప్రకటించింది. ప్రస్తుతం ఈ కంపెనీ నాలుగు ఈవీ మోడల్స్ను ఇండియాలో అమ్ముతోంది. కాగా, ప్రభుత్వం తెచ్చిన ఈవీ పాలసీతో భారీగా పెట్టుబడులు వస్తాయని అంచనా.