
- 15 ఎకరాలు కేటాయిస్తూ పాలకమండలి తీర్మానం
- భూ కేటాయింపును వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలు
- ఇప్పటికే 72 ఎకరాల్లో వివిధ ఆఫీస్లు, కబ్జాలో మరో 50 ఎకరాలు
- భవిష్యత్ అవసరాల కోసం వర్సిటీ భూములు కాపాడాలని డిమాండ్
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ భూములపై మరో కొత్త వివాదం మొదలైంది. వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను కేయూ భూముల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన 15 ఎకరాల స్థలాన్ని అప్పగించేందుకు కేయూ ఈసీ మీటింగ్ సైతం తీర్మానించింది. కానీ ఈ కేటాయింపును విద్యార్థి సంఘాల లీడర్లు వ్యతిరేకిస్తున్నారు. వర్సిటీ భవిష్యత్ అవసరాల కోసం కేటాయించిన భూమిలో కాకుండా మరోచోట స్కూల్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వివిధ అవసరాలకు 72.5 ఎకరాల భూములు
హనుమకొండ మండలంలోని కుమార్పల్లి, లష్కర్బజార్, పలివేల్పుల శివారులోని సుమారు 673.12 ఎకరాల్లో 1976లో కాకతీయ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. తర్వాత వివిధ అవసరాల కోసమంటూ వర్సిటీ భూములను కేటాయిస్తూ వచ్చారు. ఇందులో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కోసం 45.1 ఎకరాలు, రుద్రమదేవి ఫిల్టర్ బెడ్ కోసం 13.14 ఎకరాలు, సీఆర్పీఎఫ్ బెటాలియన్, క్వార్టర్స్కు 10 ఎకరాలు, కేయూ బాలమిత్ర పోలీస్స్టేషన్కు 2 ఎకరాలు ఇచ్చారు. వీటితో పాటు ఆల్ ఇండియా రేడియో స్టేషన్కు 2 ఎకరాలు, సబ్స్టేషన్కు 1.01 ఎకరాలు, మున్సిపల్ పైప్లైన్ కోసం 2.10 ఎకరాలు ఇచ్చారు. ఇలా మొత్తంగా 72.05 ఎకరాల వర్సిటీ భూములను ఇతర అవసరాల కోసం వాడుకున్నారు.
కబ్జాలో మరో 50 ఎకరాలు
యూనివర్సిటీ ఏర్పాటు కోసం హనుమకొండ మండలంలోని కుమార్పల్లి శివారులో 188 ఎకరాలు, లష్కర్ సింగారంలో 309.2, పలివేల్పుల శివారులో 175.14 ఎకరాలు కేటాయించారు. వర్సిటీ చుట్టూ సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో మూడు వైపులా ఆక్రమణలు పెరుగుతూ వచ్చాయి. ఇలా వందల కోట్ల విలువైన 50 ఎకరాలకుపైగా భూమి అన్యాక్రాంతమైంది. కొందరు వర్సిటీ ఎంప్లాయీస్, పోలీస్, ఆర్టీఏ ఆఫీసర్లు కూడా కేయూ భూముల్లోనే ఇండ్లు కట్టుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో గతేడాది విజిలెన్స్, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, మున్సిపల్, కేయూ ఆఫీసర్లు జాయింట్ సర్వే మొదలుపెట్టారు. కానీ నెలలు గడుస్తున్నా కబ్జాల వ్యవహారంపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
సీఆర్పీఎఫ్ స్థలంపై నో క్లారిటీ
కేంద్ర ప్రభుత్వం 1989లో హనుమకొండలో సీఆర్పీఎఫ్ 58వ బెటాలియన్ ఏర్పాటు చేసింది. బెటాలియన్ ఆఫీస్, క్వార్టర్స్, ఇతర అవసరాల కోసం అప్పట్లో తాత్కాలిక ప్రాతిపదికన కేయూకు చెందిన 10 ఎకరాల భూమిని కేటాయించారు. మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిన నేపథ్యంలో గతేడాది ఆగస్ట్లో బెటాలియన్ను మణిపూర్కు తరలించారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థలాన్ని తిరిగి కేయూకు అప్పగించాల్సి ఉన్నప్పటికీ.. ఆ స్థలం తమ స్టేషన్కే చెందుతుందంటూ కేయూ పోలీసులు ఆక్రమించుకోవడంతో పోలీసులు, కేయూ ఆఫీసర్ల మధ్య వివాదం తలెత్తింది. ఈ విషయాన్ని వర్సిటీ ఆఫీసర్లు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఫలితంలేకపోవడంతో ఆ పది ఎకరాలు కూడా కేయూ చేతిలో లేనట్లే అయింది.
వర్సిటీలో స్కూల్ వద్దంటున్న విద్యార్థులు
వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కేయూ భూముల్లో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు స్కూల్ కోసం 15 ఎకరాలు కేటాయిస్తూ ఈ నెల 17న కేయూ ఈసీ మీటింగ్లో తీర్మానం చేశారు. సీఆర్పీఎఫ్కు కేటాయించిన భూమిని స్కూల్కు ఇచ్చేలా నిర్ణయించారు. దీంతో కేయూ భూముల్లో స్కూల్ ఏర్పాటును వర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు.
వర్సిటీలో చాలా డిపార్ట్మెంట్లకు ఇప్పటికీ సొంత భవనాలు లేవు, మహిళా ఇంజినీరింగ్ కాలేజీతో పాటు ఎంసీజే, సైకాలజీ డిపార్ట్మెంట్లు ఎస్డీఎల్సీఈ బిల్డింగ్ కొనసాగుతున్నాయి.. స్టూడెంట్స్కు సరిపోను హాస్టల్స్ నిర్మించాల్సి ఉన్నందున, కేయూ భూములను స్కూల్కు కేటాయించొద్దని స్టూడెంట్ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. స్కూల్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా స్కూల్ను కేయూలో కాకుండా ఇతర స్థలాల్లో నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. వర్సిటీ భూములు ఇప్పటికే చాలావరకు అన్యాక్రాంతం అయ్యాయని, మిగిలిన భూములనైనా పరిరక్షించపోతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
ఆందోళనలు చేపడతాం
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు. కానీ యూనివర్సిటీలో చాలా డిపార్ట్మెంట్లకు సొంత భవనాలు లేవు. హాస్టళ్లు కూడా సరిపోవడం లేదు. భవిష్యత్ అవసరాల కోసం వర్సిటీ భూములను పరిరక్షించాలి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ను వేరే చోట నిర్మించి, యూనివర్సిటీ భూములను కాపాడాలి. లేదంటే ఆందోళనకు దిగుతాం.
కామగోని శ్రావణ్, డీఎస్ఏ రాష్ట్ర కన్వీనర్
భూములను వర్సిటీకే ఉపయోగించాలి
యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం. కానీ కేయూ భూములను ఇప్పటికే వివిధ అవసరాల పేరుతో అన్యాక్రాంతం చేశారు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్కు భూమి తీసుకోవాలని చూస్తున్నారు. వర్సిటీ భూములను యూనివర్సిటీ అవసరాలకు మాత్రమే వినియోగించాలి. కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలి.
బి.నరసింహారావు, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు