సిటీలలో పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ పెంచేందుకు కొత్త పాలసీ రానుంది

సిటీలలో పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ పెంచేందుకు కొత్త పాలసీ రానుంది

న్యూఢిల్లీ: దేశంలోని సిటీలలో పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ పెరిగేలా కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్​ వెహికల్​ ఇండస్ట్రీకి భారీ ప్యాకేజ్​ ఉంటుందని ప్రైమ్​ మినిస్టర్​ ఎడ్వైజర్​ తరుణ్​ కపూర్​ మంగళవారం వెల్లడించారు. చాలా సిటీలలో పబ్లిక్​ ట్రాన్స్​పోర్టు అంతంత మాత్రంగా ఉన్నట్లు ఒక స్టడీలో తేలిందని, దీంతో కొత్త పాలసీ రూపకల్పనకు ప్రభుత్వం నడుం బిగించిందని పేర్కొన్నారు. కొత్త పాలసీలో ఎలక్ట్రిక్​ వెహికల్స్​కు పెద్ద పీట వేయనున్నామని, డీజిల్​ వెహికల్స్​కు చోటు ఉండదని తరుణ్​ కపూర్​ స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్​ వెహికల్స్​ తయారీదారులకు ఈ కొత్త పాలసీ మంచి బూస్ట్​ ఇస్తుందని హామీ ఇచ్చారు. డీజిల్​ బస్సులు కనుమరుగవడమే కాకుండా, పబ్లిక్​ ట్రాన్స్​పోర్టుకు ఎలక్ట్రిక్​ వెహికల్స్​ వాడకం పెరుగుతుందని వివరించారు. ఎలక్ట్రిక్​ మొబిలిటీపై జరిగిన ఒక కార్యక్రమంలో తరుణ్​ కపూర్ మాట్లాడారు.

ఈవీ మాన్యుఫాక్చరింగ్​ హబ్​గా మారాలి....

ఇండియాలోని రోడ్లపై ఎలక్ట్రిక్​ కార్లు, బస్సులు, టూ వీలర్లు ఎక్కువగా పరిగెడుతుంటే చూడాలని ప్రభుత్వం కోరుకుంటోందని, దీంతోపాటు గ్లోబల్​ ఎలక్ట్రిక్​ వెహికల్స్​ మాన్యుఫాక్చరింగ్ హబ్​గానూ దేశం మారాలని ఆశిస్తోందని తరుణ్​ కపూర్ వెల్లడించారు.​ పబ్లిక్​ ట్రాన్స్​పోర్టుకు  ఎలక్ట్రిక్​ బస్సుల వాడకం మొదలైందని, కానీ ఇది మరింత జోరుగా సాగాలని ఆయన పిలుపు ఇచ్చారు. రాబోయే 5–7 ఏళ్లలో దేశంలోని టూ వీలర్లన్నీ ఎలక్ట్రిక్​ వెహికల్స్​ అవ్వాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. టూ వీలర్లు ఎలక్ట్రిక్​ అయితే పెట్రోల్ వినియోగం భారీగా తగ్గిపోతుందని వివరించారు. ఎలక్ట్రిక్​ వెహికల్స్​కు పెద్ద మార్కెట్ కానున్న నేపథ్యంలో  ఈవీల రేట్లు మరింత అందుబాటులోకి వచ్చేలా చొరవ తీసుకోవాలని ఈవీ ఇండస్ట్రీని ఆయన కోరారు. ప్రభుత్వ ఇన్సెంటివ్​లు ఒక లెవెల్​ వరకే సాయపడతాయని పేర్కొన్నారు.  ట్యాక్సేషన్​, పాలసీ రిఫార్మ్స్​ వంటి అంశాలలో తమకు ఏమి కావాలో ఈవీ ఇండస్ట్రీ సలహాలు ఇవ్వచ్చని అన్నారు. ట్రక్కులు, కార్ల సెగ్మెంట్లలోనూ దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని కపూర్​చెప్పారు. ప్రభుత్వ మద్దతుతో దేశంలో ఎలక్ట్రిక్​ వెహికల్స్​ రంగం దూసుకుపోతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కన్జూమర్లకు ఈవీలపై ఆసక్తి మెండుగా కనిపిస్తోందని పేర్కొన్నారు. కన్జూమర్లకు ఆప్షన్లు పెరగడంతోపాటు, రేట్లు కొంత తగ్గితే మేలని అభిప్రాయపడ్డారు. బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్​ వాల్యూ చెయిన్​లో అన్ని విభాగాలలోనూ పెట్టుబడులు పెంచాలని ఈవీ ఇండస్ట్రీని  కోరారు.

టూ వీలర్స్​లో మనమే నెంబర్​1.....

మన ఆటోమొబైల్​ ఇండస్ట్రీ సైజు రూ. 10 లక్షల కోట్లని హెవీ ఇండస్ట్రీస్​ సెక్రటరీ కమ్రాన్​ రిజ్వి చెప్పారు. టూ వీలర్లలో మనది గ్లోబల్​గా నెంబర్​ 1 పొజిషన్​, త్రీవీలర్లలో నెంబర్​ 2 పొజిషన్​, కార్లలో నెంబర్​ 4 పొజిషన్​లో నిలుస్తున్నామని వెల్లడించారు. ఎలక్ట్రిక్​ వెహికల్స్​ విషయంలోనూ ఇలాగే మనం టాప్​ ప్లేస్​కు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. తక్కువ బరువుండేలా బ్యాటరీలు తయారు చేయాలని సూచించారు. ఎలక్ట్రిక్​ వెహికల్స్​ సెగ్మెంట్​కు మద్దతు ఇచ్చేందుకు ఫేమ్​, పీఎల్​ఐ స్కీములు అమలులోకి తెచ్చామని చెబుతూ, ఇంకేమి కావాలో ఇండస్ట్రీ సలహా ఇవ్వాలని అన్నారు. ఏటా ఇచ్చే ఇన్సెంటివ్​ తగ్గినా పర్లేదని , కానీ ఫేమ్​3 ఇన్సెంటివ్స్ ​స్కీమును కనీసం అయిదేళ్ల కాలానికి తేవాలని ఫిక్కి ఎలక్ట్రిక్​ వెహికల్​ కమిటీ ఛెయిర్​ సులజ్జ ఫిరోదియా మోత్వాని ప్రభుత్వాన్ని కోరారు. ఇన్సెంటివ్స్​ను అకస్మాత్తుగా తగ్గించడం వల్ల ఈవీల రేట్లు హఠాత్తుగా పెరుగుతాయని....ఫలితంగా మూమెంటమ్​ దెబ్బతింటుందని   పేర్కొన్నారు. పీఎల్​ఐ స్కీమును రివైజ్​ చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బ్యాటరీలపై జీఎస్​టీని ఇప్పుడున్న 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని సులజ్జ ఫిరోదియా మోత్వాని కోరారు.

రేట్లు, బ్యాటరీ సైజు తగ్గాలి 

ఎలక్ట్రిక్​ వెహికల్స్​ రేట్లు , బ్యాటరీ సైజు తగ్గేలా ఇన్నొవేషన్​పై ఫోకస్​ పెట్టాలని ఎలక్ట్రిక్​ వెహికల్స్​ ఇండస్ట్రీకి తరుణ్​ కపూర్​ సలహా ఇచ్చారు. కొన్ని స్కాండినేవియన్​, యూరోపియన్​ దేశాలలో ఎలక్ట్రిక్​ వెహికల్స్​ వినియోగం జోరు పెరిగిందని, ఇప్పుడు మనం కూడా మన దేశంలో ఎలక్ట్రిక్​ వెహికల్స్​ వాడకం పెరిగేలా చొరవ తీసుకోవాలని ఆయన చెప్పారు. ఎనర్జీ సెక్యూరిటీ దృష్ట్యా తప్పనిసరిగా ఇండియా ఈవీల వినియోగం పెరిగేలా శ్రద్ధ వహించాల్సి ఉందన్నారు. దేశానికి అవసరమైన క్రూడ్​లో 85 శాతాన్ని, నేచురల్​ గ్యాస్​లో 50 శాతాన్ని దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటున్న విషయాన్ని కపూర్​ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్లోబల్​గా పొల్యూషన్​ ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలోని ఎక్కువ నగరాలు మన దేశంలోనే ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్​ వెహికల్స్​కు మళ్లడం తప్ప వేరే ప్రత్యామ్నాయం మనకి లేనే లేదని పేర్కొన్నారు.