
- సుప్రీంకోర్టు సూచనల మేరకు జీవో 33కి సవరణలు చేసిన ప్రభుత్వం
- 4 కేటగిరీల ఉద్యోగుల పిల్లలకు స్థానికత నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. స్థానికతకు సంబంధించి సుప్రీంకోర్టు సూచనల మేరకు జీవో నెం. 33ని సవరించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తూ బదిలీల్లో భాగంగా తెలంగాణ వెలుపల నివసిస్తున్న ఉద్యోగుల, ఆల్ ఇండియా సర్వీసుల (రాష్ట్ర కేడర్కు చెందిన ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్) కేడర్ కుటుంబాలకు చెందిన విద్యార్థులు, ఆర్మీ, పోలీస్ సిబ్బంది పిల్లలు, కార్పొరేషన్, ఏజెన్సీల్లో పనిచేసే ఉద్యోగుల కుటుంబాలకు చెందిన స్టూడెంట్స్కు స్థానికతలో మినహాయింపులు కల్పించారు.
ఈ 4 కేటగిరీలకు చెందిన విద్యార్థులు వరుసగా నాలుగేండ్లు రాష్ట్రంలో చదవకపోయినా.. తల్లిదండ్రుల ఉద్యోగం తెలంగాణకే చెందినదని, బదిలీల కాలంలో పిల్లలు రాష్ట్రం వెలుపల చదివారనే అంశాన్ని సంబంధిత ఉద్యోగ ధృవపత్రంలో పేర్కొన్నాల్సి ఉంటుంది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ సోమవారం జీవో 150 జారీ చేశారు. ఇటీవలే స్థానికతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో చేసిన సూచనలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ 4 కేటగిరీలకు చెందిన విద్యార్థులు మంగళవారం నుంచి ఈ నెల 11 వరకు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీలో అవకాశం కల్పించింది.
15 నుంచి స్టేట్ కోటా కౌన్సెలింగ్
జీవో నెంబర్ 33ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో... ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు సంబంధించి స్టేట్ కోటా కౌన్సెలింగ్ నిర్వహణకు మార్గం సుగమం అయింది. ఈ నెల 15 నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ స్టేట్ కోటా కౌన్సెలింగ్ ప్రారంభించేందకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ కసరత్తు చేస్తున్నది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి, అతి త్వరలోనే తరగతులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.