టీ20వరల్డ్ కప్ తొలి సెమీస్లో భాగంగా సిడ్నీ వేదికగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్లో కివీస్ జట్టు తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ కు ఆదిలోనే వరుస షాకులు తగిలాయి.. ఆ జట్టు ఓపెనర్ ఫిన్ అలెన్ 4 పరుగులకే ఔట్ కాగా.. ఆ తరువాత డేవన్ కాన్వే(21), ఫిలిప్స్(8) కూడా త్వరత్వరగానే వెనుదిరిగారు. పది ఓవర్లు ముగిసే టైమ్ కు ఆ జట్టు కేవలం 60 పరుగులే చేసింది. ఆ తరువాత విలియమ్సన్, మిచెల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోర్ బోర్టును పెంచారు.
ఈ క్రమంలోనే కివీస్ జట్టు వంద పరుగులను దాటింది. అయితే క్రీజ్లో పాతుకుపోయినట్టుగా కనిపించిన విలియమ్సన్(46) షహీన్ షా అఫ్రిది బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. వికెట్లు పడుతున్నప్పటికీ మిచెల్ మాత్రం ముందునుంచి దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిద్ రెండు, నవాజ్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుని, ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరగనున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో తలపడుతుంది.