ఓవైపు కరోనా విజృంభణ.. మరోవైపు పోస్ట్పోన్ దిశగా టీ20 వరల్డ్కప్..ఈ నేపథ్యంలో ఐపీఎల్కు సిద్ధమవుతున్న బీసీసీఐ. మెగా ఈవెంట్పై ఐసీసీ తీరు ఎలా ఉన్నా.. లీగ్ విషయంలో ఇండియన్ బోర్డుకు మద్దతు పెరిగిపోతుంది. ఇండియాలో లీగ్ సాధ్యం కాకపోతే.. హోస్టింగ్కు మేం రెడీ అంటూ పలు క్రికెట్ బోర్డులు పోటీపడుతున్నాయి. తాజాగా న్యూజిలాండ్ రేస్లోకి రావడంతో.. పోటీలో నిలిచిన దేశాల సంఖ్య మూడుకు చేరింది. బీసీసీఐ ఎవర్ని ఎంచుకుంటుందో చూడాలి..!!
న్యూఢిల్లీ:మొన్న యూఏఈ… నిన్న శ్రీలంక… నేడు న్యూజిలాండ్.. ఐపీఎల్కు హోస్టింగ్ ఇస్తామని ముందుకొచ్చిన దేశాలివి. మెగా లీగ్పై బీసీసీఐ ఇంకా నిర్ణయం ప్రకటించకపోయినా.. ఇతర దేశాలు మాత్రం టోర్నీ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నాయి. ఇది బీసీసీఐకి బూస్టింగ్ ఇచ్చే విషయమే అయినా.. లీగ్ను ఇండియాలో నిర్వహించాలా? విదేశాలకు తరలించాలా? అనే అంశంపైనే ఇప్పుడు ఇండియన్ బోర్డు మల్లగుల్లాలు పడుతున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాలో ఐపీఎల్ నిర్వహణ కత్తిమీద సామే. ఎందుకంటే రోజురోజుకు కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతున్నది. దీంతో ఒకే ప్రదేశంలో లీగ్ను నిర్వహించాలన్నా.. లాజిస్టిక్ సమస్యలు వస్తాయి. అయితే ఐపీఎల్ విండో అనుకుంటున్న సెప్టెంబర్, నవంబర్లో పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే చెప్పడం అసాధ్యం. కాబట్టి కొన్ని మ్యాచ్లు ఇక్కడ మరికొన్ని మ్యాచ్లు వేరే దగ్గర నిర్వహించేలా ఏమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి. ఐపీఎల్పై ఫుల్ క్లారిటీ రావాలంటే.. ముందు టీ20 వరల్డ్కప్పై ఐసీసీ ఫైనల్ డెసిషన్ వెల్లడించాలి. దానిని బట్టి మిగతా బోర్డులు ఎలా స్పందిస్తాయో చూసి మెగా లీగ్పై తుది అంచనాకు రావొచ్చు.
ఫ్రంట్ రన్నర్ యూఏఈ
కివీస్ రేస్లోకి వచ్చినా.. టైమింగ్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇండియాకు, కివీస్కు ఏడున్నర గంటలు టైమ్ డిఫరెన్స్ఉంది. మధ్యాహ్నం 12.30 గంటలకు మ్యాచ్ను ప్రారంభించినా.. ఆ టైమ్లో చాలా మంది ఆఫీస్ల్లో ఉంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్లు కూడా యాక్షన్ను మిస్ అవుతారు. దీనిపై బోర్డు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక హామిల్టన్, ఆక్లాండ్ను మినహాయిస్తే.. వెల్లింగ్టన్, క్రైస్ట్చర్చ్, నేపియర్, డునెడిన్ ప్రాంతాలను రోడ్మార్గాల ద్వారా కవర్ చేయడం సానుకూలాంశం. ఇక లంకది కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్. అక్కడ దాదాపు ఇండియాలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో యూఏఈ లీగ్ నిర్వహణ రేస్లో టాప్ ప్లేస్లో ఉంది.
ఎక్కడైనా ఫుల్ టోర్నీ..!
ఇంతవరకు మ్యాచ్ల సంఖ్యను కుదిస్తారని వార్తలు వచ్చినా దీనికి నిర్వాహకులు సుముఖంగా లేరని తెలుస్తోంది. లంక, యూఏఈ, కివీస్… టోర్నీని ఎక్కడ నిర్వహించినా సరే ఫుల్ షెడ్యూల్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ మూడు దేశాల్లో స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతి ఇస్తున్నారు. ఇది మరింత జోష్ పెంచే అంశం. అలాంటి టైమ్లో మ్యాచ్లు తగ్గిస్తే లీగ్ కళ తప్పుతుందని గవర్నింగ్ కౌన్సిల్ అభిప్రాయం. ప్రతి టీమ్ క్వారంటైన్లో ఉండటం కంపల్సరీ కాబట్టి కచ్చితంగా ఫుల్ టీమ్స్తో, ఫుల్ షెడ్యూల్లోనే ఐపీఎల్ జరుగుతుందని నిర్వాహకులు నమ్మకంతో ఉన్నారు.
కౌన్సిల్ మీట్తో క్లారిటీ
ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ రావాలంటే ముందు గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరగాలి. రెండు వారాల కిందటే అనుకుంటే గల్వామా ఘటన నేపథ్యంలో వాయిదా పడింది. అయితే అతి త్వరలోనే ఈ మీటింగ్ ఉంటుందని బీసీసీఐ అఫీషియల్ వెల్లడించాడు. ‘మా సమావేశంలో ప్రధానంగా ఐపీఎల్, వివో స్పాన్సర్షిప్పైనే చర్చ జరుగుతుంది. అప్పుడు లీగ్ఇక్కడా, బయటా అనే దానిపై క్లారిటీ వస్తుంది. ఆ లోపు ఐసీసీ కూడా ఏదో ఒకటి తేలుస్తుంది. కాబట్టి రాబోయే రెండు, మూడు వారాల్లో కీలక నిర్ణయాలు జరుగుతాయి’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
కివీస్ ఓకేనా..?
ఇండియాతో పోలిస్తే ఇతర దేశాల్లో కరోనా వ్యాప్తి కాస్త తక్కువగా ఉంది. కాబట్టి లీగ్ను వేరే దేశంలో నిర్వహిస్తే బెటర్ అని బోర్డులో ఓ వర్గం భావిస్తోంది. శ్రీలంక, యూఏఈతో పాటు న్యూజిలాండ్ కూడా హోస్టింగ్కు ముందుకు రావడంతో బీసీసీఐ ఎటువైపు మొగ్గుతుందా? అనేది ఆసక్తికరం. ప్రస్తుతం లంక, యూఏఈతో పోలిస్తే కరోనా కట్టడిలో న్యూజిలాండ్ చాలా ముందుంది. కొన్ని రోజులుగా అక్కడ పాజిటివ్ కేసులు లేవు. కాబట్టి కివీస్ వెళ్తే ఎలా ఉంటుందనే దానిపై బోర్డు దృష్టి సారించింది. ‘ఇండియాలో లీగ్ను నిర్వహించడమే మా ఫస్ట్ చాయిస్. ఇక్కడ సేఫ్ కాదని తేలితేనే ఓవర్సీస్ గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు న్యూజిలాండ్ కూడా ముందుకొచ్చింది. అక్కడ పరిస్థితులూ అనుకూలంగానే ఉన్నాయి. టీమ్స్, బ్రాడ్కాస్టర్స్,స్టేక్ హోల్డర్లతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాం.ప్లేయర్ల సేఫ్టీ విషయంలో రాజీ పడం’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వివరించారు.
కోహ్లీపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు