న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ)ను సస్పెండ్ చేయడంలో.. సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ సరైన విధానాన్ని అనుసరించలేదని కొత్తగా ఎన్నికైన సమాఖ్య చీఫ్ సంజయ్ సింగ్ అన్నాడు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాము కోర్టులో సవాల్ చేస్తామన్నాడు. స్వయం ప్రతిపత్తితో, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బాడీని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం సాధ్యం కాదన్నాడు. ‘మేం ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్దంగా నిలబడి గెలిచాం.
జమ్మూ అండ్ కశ్మీర్ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరించారు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) నుంచి పరిశీలకులు వచ్చారు. 22 రాష్ట్రాల అభ్యర్థులు ఓట్లు వేశారు. ఎన్నికల్లో 47 ఓట్లు పోలైతే నాకు 40 వచ్చాయి. వీటన్నింటిని చూసిన తర్వాత సమాఖ్యను సస్పెండ్ చేశామని సింపుల్గా ఓ నిర్ణయం తీసుకుంటే మేం అంగీకరించబోం. రెజ్లింగ్ సమాఖ్య వ్యవహారంలో మా వైఖరిని వినిపించేందుకు సమయం కూడా ఇవ్వలేదు’ అని సంజయ్ సింగ్ పేర్కొన్నాడు.