
ఢిల్లీలో నిర్భయ రేప్, మర్డర్ జరిగిన ఏడేళ్ల తర్వాత దోషులకు ఉరి శిక్ష అమలు కాబోతున్న తరుణంలో దీని ద్వారా గట్టి మెసేజ్ పంపాలని ఓ ఎన్జీవో డిమాండ్ చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ మీడియాకు ఉరి తీసే సమయంలో లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం ద్వారా ఆడపిల్లపై అఘాయిత్యాలు చేయాలనుకునే వారికి వణుకు పుట్టించాలని కోరుతోంది. మహిళల రక్షణకు భారత్ తగిన చర్యలు తీసుకుంటోందని, నేరం చేస్తే కఠిన శిక్షలు తప్పవని మెసేజ్ ఇవ్వచ్చని పీపుల్ ఎగనెస్ట్ రేప్స్ ఇన్ ఇండియా (పరీ) అనే ఎన్జీవో అభిప్రాయపడింది. తీహార్ జైలులో ఈ నెల 22న ఉదయం 7 గంటలకు అమలు కాబోతున్న నిర్భయ దోషుల ఉరి శిక్షను లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖను కోరుతూ లేఖ రాసింది.
ప్రపంచమంతా వారిని ఉరితీయడం లైవ్లో చూడడం ద్వారా భారత్లో మహిళల రక్షణకు తీసుకుంటున్న చర్యలను అందరికీ తెలియజేయొచ్చని ఆ ఎన్జీవో చీఫ్ యోగిత అన్నారు. ఈ పని చేస్తే ఆడవారిపై అఘాయిత్యాలు చేయాలనుకునే వారికి గట్టి మెజేస్ ఇచ్చినట్లవుతుందన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి రిప్లై రాలేదని చెప్పారామె.