- ‘సంగమేశ్వరం’ పనుల విషయంలో ఏపీపై ఎన్జీటీ ఆగ్రహం
- డీపీఆర్ పేరిట ప్రాజెక్టుకు అవసరమైన పనులన్నీ చేశారు
- ఏ ప్రాజెక్టుకైనా డీపీఆర్కు ఈ స్థాయిలో పనులు జరిగాయా?
- మా తీర్పును అమలు చేయకుంటే చేతులు కట్టుకుని కూర్చోవాల్నా
హైదరాబాద్, వెలుగు: రాయలసీమ లిఫ్ట్ (సంగమేశ్వరం) ప్రాజెక్ట్ పనులపై ఎన్జీటీ చెన్నై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డీపీఆర్లు అనుకుంట ప్రాజెక్టు పునాదులు తవ్వుతారా అంటూ ఏపీ ప్రభుత్వంపై మండిపడింది. ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరించి ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం ప్రాజెక్ట్ కడ్తోందని నారాయణపేట జిల్లా రైతు గవినోళ్ల శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్లను చెన్నై బెంచ్ జ్యుడీషియల్ మెంబర్ జస్టిస్ కె. రామకృష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ సత్యగోపాల్ గురువారం విచారించారు. గవినోళ్ల శ్రీనివాస్ తరఫున సుప్రీంకోర్టు అడ్వొకేట్ శ్రావణ్కుమార్, తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ రామచందర్రావు, ఏపీ తరఫున సీనియర్ అడ్వొకేట్ వెంకటరమణి వాదనలు వినిపించారు. కోర్టు తీర్పును ధిక్కరించడం పట్ల ఏపీపై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పును అమలు చేయకుంటే తాము చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోవాల్నా అని నిలదీసింది. డీపీఆర్ పేరుతో ప్రాజెక్టుకు అవసరమైన పనులన్నీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ప్రాజెక్టు డీపీఆర్కైనా ఈ స్థాయిలో పనులు జరిగినట్టు చరిత్రలో ఉందా అని ప్రశ్నించింది. ముందుగా కోర్టు తీర్పులను అమలు చేసే విషయంపై దృష్టి పెట్టాల్సిందిగా ఏపీ సర్కార్ను ఆదేశించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ధిక్కరణ పిటిషన్పై ఏపీ వాదనలు ముగిశాయని, ఇక పిటిషనర్లు గవినోళ్ల శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వ వాదనలను మంగళవారం వింటామని స్పష్టం చేసింది.
ఆ మట్టి పోతిరెడ్డిపాడుదట..
సంగమేశ్వరంపై గురువారం కూడా ఏపీ ప్రభుత్వం అదే అడ్డగోలు వాదన చేసింది. కేఆర్ఎంబీ రిపోర్ట్లో పేర్కొన్న ఫొటోలు తప్పు అని, అసలు సంగమేశ్వరం పనులనే తాము చేయట్లేదని వాదించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద తీసిన మట్టి అని, వాటిని చూపించి తెలంగాణ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఎన్జీటీకి వివరించింది. తప్పుడు ఫొటోలు, వీడియోలు చూపించిన తెలంగాణ
సర్కార్పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఏపీ వాదనపై ఎన్జీటీ అసహనం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను అమలు చేయకుండా ఏపీ ధిక్కరించిందని పేర్కొంది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశిస్తే ఏం చేస్తారని ఏపీ తరఫు లాయర్ను ప్రశ్నించింది. ప్రాజెక్టు పనులు ప్రజల ఉపయోగం కోసమని, వాటిని కోర్టులు, ట్రిబ్యునళ్లు అర్థం చేసుకోవాలనే కొత్త వాదనను ఏపీ లాయర్ తెరపైకి తీసుకొచ్చారు. ప్రాజెక్ట్ డీపీఆర్ సహా ఇతర అవసరాల కోసమే సంగమేశ్వరం పనులను చేశామన్నారు. అవసరానికి మించి కొంత ఎక్కువ పనులు చేసినంత మాత్రాన అధికారులను జైలుకు పంపుతారా అని ప్రశ్నించారు. ఇప్పటిదాకా చేసిన పనులను పూడ్చేయాలా అని అన్నారు. ఓ ప్రైవేట్ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్లో తెలంగాణ సర్కార్ ఇంప్లీడ్ అవ్వడమేంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎస్ను జైలుకు పంపాలన్న పిటిషన్ను కొట్టేయాల్సిందిగా కోరారు. రాష్ట్రాల మధ్య వచ్చే సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు.