పాక్‎కు దేశ రహస్య సమాచారం లీక్.. CRPF సిబ్బందిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

పాక్‎కు దేశ రహస్య సమాచారం లీక్.. CRPF సిబ్బందిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

న్యూఢిల్లీ: దాయాది పాకిస్థాన్ దేశానికి గూఢచార్యం చేస్తోన్న స్పైల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. దేశ సున్నిత, రహస్య సమాచారం పాక్‎కు చేరవేశారన్న ఆరోపణలపై హర్యానా, యూపీ, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇవే తరహా ఆరోపణలపై మరో వ్యక్తిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అరెస్ట్ చేసింది. పాకిస్తాన్ నిఘా అధికారులకు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారనే ఆరోపణలపై CRPF  సిబ్బంది మోతీ రామ్ జాట్‌‎ను సోమవారం (మే 26) ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.   

కాగా, ఢిల్లీకి చెందిన మోతీ రామ్ జాట్ 2013 నుంచి సీఆర్పీఎఫ్‎లో పని చేస్తున్నాడు. 2023 నుంచి జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో (PIO) పంచుకుంటున్నట్లు గుర్తించామని ఎన్ఐఏ పేర్కొంది. దేశ రహస్య సమాచారాన్ని చేరవేసినందుకు ప్రతిఫలంగా పీవోఐల నుంచి వివిధ మార్గాల ద్వారా నిందితుడు మోతీ రామ్ నిధులు అందుకున్నాడని తెలిపింది. 

ALSO READ | ఆపరేషన్ సిందూర్​ మన ధైర్యానికి నిదర్శనం

దేశంలో అతిపెద్ద పారామిలిటరీ దళమైన సీఆర్ఫీఎఫ్ లో ఉంటూ పాక్ నిఘా వర్గాలకు సున్నితమైన సమాచారం చేరవేడయాన్ని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే నిందితుడు మోతీరామ్ ను సోమవారం (మే 26) అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశ పెట్టారు. నిందితుడి నుంచి మరిన్నీ వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి అప్పగించాలని ఎన్ఏఐ కోర్టును విజ్ఞప్తి చేసింది. ఎన్ఐఏ అభ్యర్థ మేరకు నిందితుడు మోతీ రామ్‎ను కోర్టు 2025, జూన్ 6 వరకు కస్టడీకి అప్పగించింది. 

ఇటీవల భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిఘా సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్న స్పైలపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే పాకిస్థాన్ గూఢచారులుగా పని చేస్తోన్న గుజరాత్, పంజాబ్, యూపీ, హర్యానా రాష్ట్రాలకు చెందిన 19 మంది అరెస్ట్ చేశారు.