
ఖైరతాబాద్,వెలుగు : ఎస్సీ, ఎస్టీ, బీసీలను రాష్ట్ర అడ్వకేట్జనరల్ పదవికి ఎంపిక చేయాలని తెలంగాణ జడ్జెస్అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డ్ జడ్జి నిమ్మ నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ అడ్వకేట్స్ ఫోరం ఆధ్వర్యంలో‘న్యాయవ్యవస్థలో మేమెంతో.. మాకంత’ అంశంపై శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. న్యాయశాఖలో ఉన్నత పదవులు కొందరినే వరిస్తున్నాయని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అడ్వకేట్జనరల్,అడిషనల్అడ్వకేట్జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లాంటి పదవులు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి కేసీఆర్బంధువులే న్యాయవ్యవస్థలో ఉన్నత పదవులు పొందారని ఆరోపించారు.
ఇటీవల కొలిజియం సిఫార్సుతో జడ్జిల ఎంపికకు నలుగురి పేర్లను పంపారని, అందులో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థుల పేర్లు లేవని పేర్కొన్నారు. ఆ ఎంపికను నిలిపివేసి ఎస్సీ,ఎస్టీ అభ్యర్థుల పేర్లతో సిఫారసు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. లాయర్ భీమారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించగా.. ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్, లాయర్లు భూమా గంగాధర్, దున్న అంబేద్కర్, మేకల కమలాకర్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.